డైరెక్ట్ ఎటాక్… కసి తీర్చుకుంటున్న రేవంత్ ?

మొహమాటం లేదు. డొంకతిరుగుడు లేదు. చెప్పదలచుకున్నది, అనదలచుకున్నది స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా ? అవును పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురించే. ఇంతకీ విషయం ఏమిటంటే నల్గొండ జిల్లాలో రేవంత్ ఆధ్వర్యంలో బహిరంగ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి, ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ విషయంలో రేవంత్ డైరెక్టు ఎటాక్ మొదలుపెట్టేశారు. 

రాజగోపాల్ ను ఉద్దేశించి నీచ్ కమీన్ కుత్తే లాంటి అనేక ఉపమానాలను ఉపయోగించారు. అమిత్ షా కుక్కలన్నారు. బీజేపీ విసిరే ఎంగిలి మెతుకులకు కక్కుర్తిపడి రాజగోపాల్ కాంగ్రెస్ కు ద్రోహం చేసి బీజేపీలోకి వెళుతున్నట్లు మండిపడ్డారు. అరేయ్..ఓరేయ్ అంటు రెచ్చిపోయారు.  నిజానికి రాజగోపాల్ గురించి రేవంత్ ఇంత డైరెక్టుగా తిట్టాల్సిన అవసరమే లేదు. అయినా తిట్టారంటే ఎంఎల్ఏపై తనలో పేరుకుపోయిన కసినంతా రేవంత్ తీర్చుకుంటున్నట్లే అర్ధమవుతోంది.

ఎందుకంటే రేవంత్ ను ఉద్దేశించి ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళొచ్చిన దొంగ, ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాలతో సహా  పట్టుబడిన దొంగ అంటు ఇప్పటికే రాజగోపాల్ చాలాసార్లు డైరెక్టుగానే అన్నారు. గురువారం వరకు రాజగోపాల్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి రేవంత్ ఓపిక పట్టినట్టుగా ఉంది. శుక్రవారం ఎంఎల్ఏగా కూడా రాజీనామా చేసేయటంతో ఇక ఆకాశమే హద్దుగా రేవంత్ రెచ్చిపోతున్నారు. రాజగోపాల్ ను పార్టీ క్యాడర్ ముందు బాగా వీక్ చేయటం, రాజగోపాల్ కు పార్టీ క్యాడర్లో ఏమాత్రం మద్దతు లేదని నిరూపించటమే టార్గెట్ గా రేవంత్ రెచ్చిపోతున్నారు.

రాజగోపాల్ బలమంతా కాంగ్రెస్ క్యాడరేనని క్యాడర్ ఎవరు ఎంఎల్ఏతో వెళ్ళలేదు కాబట్టి ఎంఎల్ఏ నతింగ్ అన్నట్లుగా రేవంత్ మాట్లాడారు. జరగబోయే ఉఫఎన్నికలో కాంగ్రెస్ గెలవకపోయినా వచ్చే నష్టమేమీ లేదని పీసీసీ అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు. కాకపోతే కాంగ్రెస్ గెలిస్తే టీఆర్ఎస్, రాజగోపాల్ కు బుద్ధి చెప్పినట్లవుతుందన్నారు.  కాంగ్రెస్ క్యాడర్ సత్తాఏమిటో చాటాల్సిన సమయం వచ్చిందని రేవంత్ చెప్పటం గమనార్హం.