వెంకటరెడ్డి జంప్.. ఖాయమేనా?

తెలంగాణా కాంగ్రెస్ లో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా జంపైపోవటం ఖాయమనే అనిపిస్తోంది. తనపై మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఆరోపణలు, విమర్శలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దాంతో ఎలాంటి సంబంధంలేని రాజగోపాలరెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీన్ లోకి ఎంటరయ్యారు. తమను రేవంత్ వెన్నుపోటు దారులుగా, అవినీతి పరులుగా ముద్రవేసి అవమానించారంటు రెచ్చిపోయారు.

నిజానికి రేవంత్ అన్నది రాజగోపాల్ ను మాత్రమే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరిదీ ఒకేమాట ఒకేబాట. రాజగోపాల్ ఎప్పుడైతే కాంగ్రెస్ ను వదిలేయాలని డిసైడ్ అయ్యారో ఏదోరోజు అన్న వెంకటరెడ్డి కూడా జంపైపోవటం ఖాయమని అందరు అనుకుంటున్నదే. తాజాగా తమ్ముడు చేసిన వ్యాఖ్యలు కూడా దాన్ని సూచిస్తున్నాయి. ఎంఎల్ఏగా రాజీనామా చేసిన సందర్భంగా మాట్లాడుతూ తామిద్దరి ఆలోచనలు, నడక ఒకే విధంగా ఉంటాయన్నారు.

అంటే అర్థమేంటి ? తాను కాంగ్రెస్ కు రాజీనామా చేశాను కాబట్టి తొందరలోనే తన అన్న కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేసేస్తారని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదని రాజగోపాల్ చెబుతున్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరాలని ఎప్పుడో డిసైడ్ అయిపోయిన విషయం అందరికీ తెలుసు. లేకపోతే కాంగ్రెస్ ఎంఎల్ఏగా ఉండి నరేంద్రమోడీ, బీజేపీని పొగడటమంటేనే ఎంఎల్ఏ ఆలోచనలేమిటో అందరికీ అర్ధమైపోయింది.

ఏదో రోజు ముహూర్తం చూసుకుని బీజేపీలో చేరిపోవటం ఖాయం. ఆ తర్వాత ఏదో రోజు అన్న వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరిపోతారని పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చలు మొదలైపోయింది. దానికి తగ్గట్లే రాజగోపాల్ రాజీనామాతో పాటు రేవంత్ పై ఫిర్యాదులు చేస్తు సోనియాకు పెద్ద లేఖ రాశారు. ఆ లేఖను వెంకటరెడ్డి సమర్ధిస్తున్నారంటేనే బ్రదర్స్ ఆలోచనలు ఎలాగున్నాయో తెలిసిపోతోంది. ఇదంతా తనను కాదని రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగించారన్న మంటే వెంకటరెడ్డిలో బయటపడుతోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.