టీడీపీ-బీజేపీ మైత్రి ఇప్ప‌ట్లో సాధ్యం అయ్యేనా

కొన్ని విష‌యాలు చేదుగా ఉన్నా.. క‌నిపిస్తున్న వాస్త‌వాల‌ను బ‌ట్టి.. దిగ‌మింగ‌క త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఇబ్బందిక‌ర స‌ర్కిల్లో ఇరుక్కుపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాలంటే.. గ‌ట్టి ప్ర‌య‌త్నం చేయాల్సిందే. ప్ర‌స్తుతం టీడీపీ అధినేత పొత్తు చూపులు చూస్తున్నార‌నేది త‌మ్ముళ్ల బ‌ల‌మైన న‌మ్మ‌కం. ఇది నిజ‌మే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు ఉంటాయ‌ని నేరుగా చెప్ప‌క‌పోయినా.. చంద్ర‌బాబు ప‌దే ప‌దే త్యాగాల గురించి ప్ర‌స్తావించారు. దీంతో పొత్త‌లకు ఆయ‌న రెడీ అవుతున్నార‌నే సంకేతాలు ఇచ్చారు.

ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు చంద్ర‌బాబు ప‌దే ప‌దే చేస్తున్న ప్ర‌య‌త్నాలు ప్ర‌స్ఫుటంగా క‌నిపిస్తు న్నాయి. ద్రౌప‌ది ముర్ముకు వైసీపీ మ‌ద్దతివ్వ‌డాన్ని ప్ర‌శ్నించిన ఆయ‌నే.. ప‌ట్టుమ‌ని మూడు రోజులు కూడా గ‌డ‌వ‌క ముందే.. ఎవ‌రికీ చెప్పాపెట్ట‌కుండా త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇది ఖ‌చ్చితంగా బీజేపీని కౌగించుకునేందుకేన‌నే సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయింది. అయితే.. ప్ర‌స్తుతం కేంద్రం నుంచి వ‌స్తున్న సంకేతాల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌-మోడీల బంధం ఇప్ప‌ట్లో తెగేది కాద‌ని తేలిపోయింది. అప్పుల విష‌యంలో రాష్ట్రం హ‌ద్దులు మీరుతోంద‌ని ప్ర‌క‌టించి.. ప్ర‌జెంటేష‌న్ కూడా ఇచ్చిన కేంద్రం.. ఇంకేముంది.. రాష్ట్రం లంక అయిపోతోంద‌ని.. క‌ల‌వ‌రించింది.

దీంతో స‌హ‌జంగానే జ‌నాలు స‌హా వైసీపీ నాయ‌కులు కూడా ఇక‌, కేంద్రం ఉక్కు పిడికిలి బిగించింద‌ని.. జ‌గ‌న్‌కు దారి లేద‌ని.. అనుకున్నారు. ఇలా అనుకున్నారో.. లేదో వెంట‌నే ప్లేట్ ఫిరాయించి.. మ‌రిన్ని అప్పులు చేసుకునేందుకు వీలు క‌ల్పించింది. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలో టీడీపీకి అవ‌గ‌తం కావ‌డం లేదు. జ‌గ‌న్ త‌ప్పుకొంటే.. ఆ ప్లేస్‌లోకి తాము వెళ్లాల‌నేది టీడీపీ వ్యూహం. కానీ, జ‌గ‌న్‌ను త‌ప్పుకోమ‌ని బీజేపీ చెప్ప‌దు. అలాగ‌ని అది కూడా త‌ప్పించ‌దు. జ‌గ‌న్ మాత్రం కేంద్రాన్ని ఎందుకు వ‌దులు కుంటారు. అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

దీంతో టీడీపీ-బీజేపీ మైత్రి ఇప్ప‌ట్లో సాధ్యం అయ్యేనా అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. దీనిని బ‌ట్టి తెలిసిందేంటంటే.. టీడీపీ వ్యూహం మార్చుకోవాల్సిందే అని! కేంద్రం చేస్తున్న త‌ప్పులు.. రాష్ట్రం చేస్తున్న అప్పుల‌ను ఏక‌తాటిపైకి తెచ్చి ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డ‌మే. అదేస‌మ‌యంలో ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు కార‌ణాలు.. ప‌న్న‌లు మోత‌కు రీజ‌న్ల‌ను వెతికి ప‌ట్టుకుని జ‌నంలో క‌డిగేడ‌య‌మే.. ఇది చేస్తే.. జ‌నం ఇప్పుడు న‌మ్ముతార‌నేది నిష్ఠుర స‌త్యం. అప్పుడు పొత్తుల‌తో ప‌నేలేదనేది విశ్లేష‌కుల మాట‌. కానీ, ఈ దిశ‌గా టీడీపీ అధినేత చంద్ర‌బాబు అడుగులు ప‌డ‌డం లేద‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌.

వాస్త‌వానికి గ‌తంలో జ‌గ‌న్ జ‌నంలోకి వెళ్లి న‌ప్పుడు ఏంచెప్పారో.. చంద్ర‌బాబు గుర్తు చేసుకోవాలి. రాష్ట్రం చేస్తున్న త‌ప్పుల‌నే కాదు.. కేంద్రంతో చంద్ర‌బాబు లాలూచీ ప‌డ్డారని.. అందుకే హోదా లేకుండా పోయింద‌ని చెప్పుకొచ్చారు. ఇది నిజ‌మే! అని జ‌నం న‌మ్మేంత‌గా ఆయ‌న ప్ర‌చారం చేశారు. త‌ర్వాత‌.. అదే బీజేపీతో అదే మోడీతో జ‌గ‌న్ చేతులు క‌లిపారు. మ‌రి ఇలాంటి త‌ప్పుల‌ను ఇప్పుడు చంద్ర‌బాబు ఎందుకు కార్న‌ర్ చేయ‌డం లేదు. పోరాడితే పోయేదేమీ లేద‌న్న‌ట్టుగా.. ఒక్క రాష్ట్ర‌మే కాదు.. కేంద్రం కూడా త‌ప్పులు చేస్తోంద‌ని జ‌నం బ‌లంగా విశ్వ‌సిస్తున్న స‌మ‌యంలో .. వారి విశ్వాసాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకునే వ్యూహానికి బాబు ప‌దును పెట్టి పోరాడ‌డ‌మే ముందున్న కీల‌క క‌ర్త‌వ్యం!! మ‌రి ఏం చేస్తారో చూడాలి.