రోజాకు షాక్.. మన పార్టీని నమ్ముకుని అప్పులపాలయ్యామని ఫ్లెక్సీ

వైసీపీ కీల‌క నాయ‌కురాలు.. ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాకు సొంత పార్టీ నేత‌ల నుంచే భారీ సెగ త‌గిలింది. అది కూడా ఆమె సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రిలో ఆమెను కొంద‌రు నిల‌దీశారు. తాము వైసీపీలో ఎప్ప‌టి నుంచో ప‌నిచేస్తున్నామ‌ని.. అయితే.. త‌మ‌కు పార్టీని న‌మ్ముకున్నందుకు అప్పులు మిగిలాయ‌ని.. బాధితులు తీవ్ర ఆవేద‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో ఫ్లెక్సీలు ప్ర‌ద‌ర్శించి.. నిర‌స‌న తెలిపారు. దీంతో మంత్రి రోజాకు ఏం చేయాలో అర్ధం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

వైసీపీను నమ్ముకుని పనులు చేస్తే.. బిల్లులు రాక పోగా.. ఎదురు ఆ డ‌బ్బుల‌కు వ‌డ్డీలు క‌ట్టేందుకు అప్పుల పాలయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి రోజా నియోజకవర్గం న‌గ‌రిలో చోటు చేసుకున్న‌ ఈ ఘటన స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది. మంత్రి రోజా తాజాగా ‘గడప గడప’కు కార్యక్రమం నిర్వ‌హించారు. చిత్తూరు జిల్లాలోని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రిలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో భాగంగా.. బుట్టిరెడ్డి కండ్రిగకు వచ్చిన రోజా ఎదుట మాజీ సర్పంచ్, ఆయన భార్య తమ గోడు వెళ్లబోసుకున్నారు.

వీరితోపాటు మ‌రికొంద‌రు.. కూడా నిర‌స‌న‌కు దిగ‌డంతో మంత్రి రోజాకు సొంత నియోజకవర్గంలో వైసీపీ వర్గీయుల నుంచే నిరసన ఎదురైంది. వడమాల పేట మండలం బుట్టిరెడ్డి కండ్రిగలో చేపట్టిన రహదారుల నిర్మాణం బిల్లులకు సంబంధించి.. మంత్రి రోజా ఎదురుగానే మాజీ సర్పంచ్‌, అతడి భార్య నిరసనను వ్యక్తం చేశారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా రోజా గ్రామానికి రాగా.. పనులు చేయనివారికి బిల్లులు ఇచ్చారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీ ని నమ్ముకుంటే తమను అప్పులపాలు చేశారని వాపోయారు. దీంతో ఏం చెప్పాలో తెలియ‌ని రోజా.. త‌ను ప‌రిశీలిస్తాన‌ని.. న్యాయం చేస్తాన‌ని చెప్పారు. ఇక‌, అక్క‌డి నుంచి త‌ప్పించుకుని వెళ్లిపోయారు.