ఆయనపై మాల్దీవుల్లోను అంత కోపముందా?

శ్రీలంక వదిలేసి పారిపోయిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కు మాల్దీవుల్లోనూ నిరసనలు తప్పలేదు. తన కుటుంబంతో కలిసి రాజపక్స శ్రీలంకను వదిలి బుధవారం తెల్లవారి మాల్దీవులకు పారిపోయారు. దేశాన్ని అన్ని విధాల భ్రష్టుపట్టించి ప్రాణభయంతో ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి పారిపోయారు. మొదట్లో దుబాయ్ కి వెళ్ళిపోవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో విమానాశ్రయం నుండి తిరిగి వెళ్ళిపోయిన కుటుంబసభ్యులు మళ్ళీ చడీచప్పుడు లేకుండా రాజపక్సతో కలిసి దేశం వదిలేశారు.

శ్రీలంకను నాశనం చేసి తమ దేశానికి వచ్చిన రాజపక్సకు మాల్దీవుల జనాల నుండి కూడా నిరసనలు తప్పలేదు. శ్రీలంక అధ్యక్షుడిని కుటుంబంతో పాటు రానిచ్చినందుకు దేశవ్యాప్తంగా స్ధానికులు నిరసనలతో హోరెత్తించారు. శ్రీలంక అధ్యక్షుడి హోదాలో రాజపక్స రావటం వల్ల దేశంలోకి అనుమతించక తప్పలేదని ప్రభుత్వం ఎంత చెప్పినా ఆందోళనకారులు వినిపించుకోవటం లేదు.

నిజానికి రాజపక్స మాల్దీవుల్లోకి అడుగుపెట్టినంత మాత్రాన వాళ్ళకి వచ్చిన నష్టమేమీలేదు. కానీ ఒకదేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసి కోట్లాదిమంది ప్రజలను నానా వెతలకు గురిచేసిన రాజపక్స కుటుంబంపై అన్నీ దేశాల ప్రజల్లోను వ్యతిరేకత ఉంది. ఇందులో భాగంగానే అద్యక్షుడి కుటుంబం తమ దేశంలోకి రావటాన్ని జనాలు వ్యతిరేకిస్తున్నారంతే. అయితే తమ ప్రభుత్వం రాజపక్సకు సకల లాంఛనాలతో స్వాగతం పలకటం, విశిష్ట అతిధిగా మర్యాదలు చేయటాన్ని లోకల్ జనాలు తట్టుకోలేకపోతున్నారు.

ఒకటి రెండు రోజుల్లో అధ్యక్షుడు తన కుటుంబంతో కలిసి సింగపూర్ కు వెళ్ళే అవకాశాలున్నాయని సమాచారం. తన కుటుంబం సురక్షిత ప్రాంతానికి వెళ్ళే విషయమై రాజపక్స ఆలోచిస్తున్నారట. ముందైతే సింగపూర్ కు వెళ్ళిపోయి అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలనేది నిర్ణయించుకుంటారని అంటున్నారు. సో రాజపక్స ఆలోచనల ప్రకారం చూస్తే ఇప్పుడిప్పుడే అధ్యక్షుడిగా రాజీనామా చేసేట్లు లేరు. ఎందుకంటే అధ్యక్షుడి హోదాలోనే ఏ దేశంలో అయినా రాజపక్స ల్యాండ్ అవ్వగలరు. అధ్యక్షుడిగా రాజీనామా చేసేస్తే మాజీ అధ్యక్షుడి హోదాలో శరణార్ధి అయిపోతారు. చివరకు ఏమవుతుందో చూడాలి.