మోడీకి భ‌య‌ప‌డ్డ శివ‌సేన‌? ఉద్ధ‌వ్ యూట‌ర్న్‌.. ముర్ముకు మ‌ద్ద‌తు!

మ‌హారాష్ట్ర రాజ‌కీయం మ‌రోసారి సంచ‌ల‌నంగా మారింది. ఇక్క‌డి ఉద్ద‌వ్ ఠాక్రేను బీజేపీ ప‌డ‌గొట్టిన విష‌యం తెలిసిందే. స్వ‌యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, అమిత్ షాల సూచ‌న‌ల‌తోనే తాము రెబ‌ల్‌గా మారామంటూ.. ఏక్‌నాథ్ షిండే ప్ర‌క‌టించిన విష‌యం సంచ‌లనంగా మారిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే.. అదే ఉద్ద‌వ్ ఠాక్రే.. ఇప్పుడు అదే బీజేపీకి స‌న్నిహితుడు కావ‌డ‌మే ఇప్పుడు మ‌రో ట్విస్ట్. నిన్న‌గాక మొన్న త‌న నిండు ప్ర‌భుత్వాన్ని ప‌డగొట్టిన బీజేపీతో చేతులు క‌లిపేందుకు ఉద్ద‌వ్ రెడీ అయ్యారు. బీజేపీ నిల‌బెట్టిన రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

దీంతో మ‌హారాష్ట్ర‌లో ఉద్ద‌వ్ సేన‌.. మోడీ భ‌య‌ప‌డుతోంద‌నే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు అంశంపై ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని శివసేన కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో దిగిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెకు మద్దతు ఇవ్వాలని తనపై ఎలాంటి ఒత్తిడి రాలేదని.. తన పార్టీ ఎంపీలతో నిన్న మాతోశ్రీలో జరిగిన సమావేశంలోనూ వారెలాంటి ఒత్తిడి చేయలేదని స్పష్టంచేశారు.

రాష్ట్రపతి పదవికి దేశంలోనే తొలిసారి ఒక ఆదివాసీ మహిళకు అవకాశం వచ్చిందని తన పార్టీలోని ఆదివాసీ నేతలు తనతో అన్నారని ఉద్ధవ్‌ తెలిపారు. వాస్తవానికి.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీయే నిలబెట్టిన ద్రౌపదీ ముర్మూకు తాము మద్దతు ఇవ్వాల్సి ఉండేది కాదని.. కానీ తమది అంత సంకుచిత మనస్తత్వం కాదని వ్యాఖ్యానించారు. ఉద్ధవ్‌ఠాక్రే ప్రైవేటు నివాసం మాతోశ్రీలో పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ద్రౌపదికే మద్దతు ఇవ్వాలని ఎక్కువ మంది సభ్యులు కోరినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఒకట్రెండు రోజుల్లో తన నిర్ణయం వెల్లడిస్తానని తెలిపిన ఉద్ధవ్‌ ఠాక్రే.. శివసేన మద్దతు ద్రౌపదీ ముర్మూకే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. శివసేనకు లోక్‌సభలో మొత్తంగా 18మంది ఎంపీలు ఉండగా.. వీరిలో 15మంది ఎంపీలు సమావేశానికి నేరుగా హాజరయ్యారు. అయితే, వారంతా ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని ఠాక్రేను కోరినట్టు ఆ పార్టీ ఎంపీ గజానన్‌ కిరీట్కర్ వెల్లడించారు. ద్రౌపది ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన వారు.. పైగా ఓ మహిళ కావడంతో ఆమెకే మద్దతు ఇవ్వాలని వారంతా అభిప్రాయపడినట్టు ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర జనాభాలో దాదాపు 10శాతం ఆదివాసీలు ఉన్నారు. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున ద్రౌపదీ ముర్మూ.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా బరిలో నిలిచిన విషయం తెలిసిందే.