అమ్మ‌ను త‌రిమిశాడు.. బాబాయ్‌ని చంపేశాడు: జ‌గ‌న్‌పై బాబు ఫైర్‌

సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుప‌తి జిల్లా నగరిలో ఆయన రోడ్‌షో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయాల కోసం జగన్‌ అందరినీ వాడుకుని వదిలేశారని ధ్వజమెత్తారు. బాబాయ్‌ను చంపాడు.. అమ్మను పార్టీ నుంచి తరిమేశాడని దుయ్యబట్టారు. పోలీసులను పెట్టుకుని తిరగడం కాదని, నాడు ముద్దులు పెట్టినప్పుడు ఎలా తిరిగావో ఇప్పుడు అలా తిరుగుచూద్దామని హెచ్చరించారు.

జనాగ్రహం ఏమిటో అప్పుడు జగన్‌కు తెలుస్తుందన్నారు. జగన్‌ మద్యంలో విషపదార్థాలు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. జే బ్రాండ్‌పై వైసీపీ ప్లీనరీలో సమాధానం చెప్పాలని చంద్రబాబు సవాల్ విసిరారు. అరాచక పాలన పోవాలంటే తాను ఒక్కడినే పోరాడితే చాలదని, ప్రజలు అండగా నిలబడాలని, ఇంటికొకరు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. “3 రాజధానులు కడతాడట, డ్యాములు నిర్మిస్తాడట. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం పెట్టారు. ఆ స్ఫూర్తితోనే అన్న క్యాంటీన్లు పెట్టా. ఆకలి తీర్చే అన్నక్యాంటీన్లు రద్దు చేస్తారా.. ఇదేనా పేదలపై ప్రేమ.” అని నిల‌దీశారు.

“నేను తెచ్చానన్న కోపంతో అనేక ప్రాజెక్టులు ఆపారు. పార్టీలో ఎన్నికలు లేకుండా శాశ్వత అధ్యక్షుడుగా ప్రకటించుకున్నారు. జగన్ నొక్కేవన్నీ ఉత్తుత్తి బటన్‌లే. ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారో ఆన్‌లైన్‌లో పెట్టగలరా. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్న సాక్షి.. ఇప్పుడు లాభాల బాటలో ఉంది. భారతి సిమెంట్ కోసం అన్ని సిమెంట్ ధరలు పెంచేలా చేశాడు” అని చంద్రబాబు దుయ్యబట్టారు.

వైసీపీ హయాంలో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయన్నారు. జగన్‌ ఒకే ఒక్క ఆర్డరుతో 10 వేల పాఠశాలలు రద్దు చేశారని అన్నారు. అమ్మఒడి పథకం పెద్దబూటకం.. నాన్న బుడ్డి మాత్రం వాస్తవం. విద్యుత్‌ 300 యూనిట్లు వాడితే ‘అమ్మఒడి’ రద్దు చేస్తారు. పాఠశాలల్లో 75 శాతం హాజరు లేకపోయినా ‘అమ్మఒడి’ రద్దు చేస్తారు. సీఎం చేస్తున్న తప్పులు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మను రాజీనామా చేయించారు. జగన్‌ జీవితకాల వైసీపీ అధ్యక్షుడిగా ఉంటారు.. ఇది ప్రజాస్వామ్యమా? పెగాసెస్ ఉపయోగించానని నాపై కేసు పెడతారంట. నేను ప్రజలకు భయపడతాను తప్ప, కేసులకు కాదు.” అని చంద్రబాబు ధ్వజమెత్తారు.