సీఎం ప‌ద‌వికి ఠాక్రే రాజీనామా

గ‌త వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠ‌కు.. గురిచేసిన మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో పెను ప్ర‌కంప‌న‌. పులిబిడ్డ‌గా ప్రాచ‌ర్యం పొందిన బాల ఠాక్రే కుమాడు.. సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే కంట‌త‌డి.. ఎట్టి ప‌రిస్థితిలోనూ గురువార‌మే బ‌ల‌ప‌రీక్ష జ‌రిపి తీరాల‌న్న అత్యున్న‌త ధ‌ర్మాస‌నం ఆదేశం.. ‘మాదారి మాదే..’ అని భీష్మించిన రెబ‌ల్ ఎమ్మెల్యేలు.. అధికారం కోసం పాచిక‌లాడిన బీజేపీ వ్యూహాలు.. వెర‌సి.. మ‌హా రాష్ట్ర స‌ర్కారు కేవ‌లం రెండు సంవ‌త్స‌రాల 7 నెల‌ల కాలంలో కుప్ప‌కూలింది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం బలపరీక్ష జరగాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన క్షణాల్లోనే తన రాజీనామా ప్రకటించారు. ఫేస్బుక్ లైవ్లో మాట్లాడిన ఉద్ధవ్.. తన నిర్ణయాన్ని వెలువరించారు. ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు కృతజ్ఞతలు తెలిపారు. రిక్షావాలాను మంత్రిని చేస్తే.. ఆయనే తనకు ద్రోహం చేశారంటూ పరోక్షంగా ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రకటించిన ఠాక్రే.. ప్రజాస్వామ్య విధానాలను కూడా అనుసరించాలని కోరారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమతో మాట్లాడాలని మరోసారి సూచించారు.

”సోనియా గాంధీ, శరద్ పవార్కు కృతజ్ఞతలు. బాలాసాహెబ్ ఆశయాలు నెరవేర్చాం. మా ప్రభుత్వానికి కొందరి దిష్టి తగిలింది. ఆ దిష్టి ఎవరిదో అందరికీ తెలుసు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. ఔరంగాబాద్ పేరును మార్చాం. రెబల్ ఎమ్మెల్యేలు మాతో మాట్లాడాల్సింది. మా పార్టీ వాళ్లే మమ్మల్ని మోసం చేశారు.” అని ఠాక్రే భావోద్వేగానికి లోన‌య్యారు.

దీనికి ముందు నిర్వ‌హించిన మహారాష్ట్ర కేబినెట్‌ సమావేశం అనంతరం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. తన వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించండని మంత్రులతో అన్నారు. తన వాళ్లే తనను మోసం చేశారని, కేబినెట్ భేటీ తర్వాత మీడియాకు నమస్కరించి ఉద్ధవ్‌ సచివాలయం నుంచి వెళ్లిపోయారు. మహారాష్ట్రలోని కొన్ని పట్టణాల పేరును మారుస్తూ ఉద్ధవ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఔరంగాబాద్ పేరు శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్‌ పేరు ధారాశివ్‌గా, డీబీ పాటిల్‌ ఎయిర్‌పోర్ట్‌గా నవీముంబై ఎయిర్‌పోర్ట్‌‌ను మార్చుతూ చేసిన ప్రతిపాదనలకు ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్‌ ఆమోదం తెలిపింది.