సాయిరెడ్డీ.. ఎంత కోప‌ముంటే మాత్రం ఇలా రాయుడేంది?

వైసీపీ కీల‌క నాయ‌కుడు.. ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తాజాగా పార్ల‌మెంటు స్పీక‌ర్ ఓం బిర్లాకు రాసిన లేఖ వివాదానికి దారితీసింది. రాజ‌కీయంగా ఎంతో ప‌రిపక్వ‌త సాధించాన‌ని.. చెప్పుకొనే సాయిరెడ్డి ఏమాత్రం ప‌ర‌ప‌క్వ‌త లేకుండా వ్య‌వ‌హ‌రించార‌నే వాద‌న వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. తాజాగా సాయిరెడ్డి రాసిన లేఖే. విష‌యం ఏంటంటే.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు పార్టీ అధిష్టానానికి మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న నిత్యం ర‌చ్చ‌బండ‌ను వేదిక‌గా చేసుకుని ప్ర‌భుత్వ విధానాల‌ను త‌ప్పుబ‌డుతున్నారు.

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ఇదే తంతు న‌డుస్తోంది. ఇక‌, రాష్ట్ర స‌ర్కారు మాత్రం త‌క్కువ తిందా? అంటే.. ఏమీకాదు.. ర‌ఘురామ‌ను ఎంత యాగీ చేయాలో అంతా చేసింది. కేసులు పెట్టి.. పోలీసుల‌తో కొట్టించింద‌ని ర‌ఘురామ ఇప్ప‌టికి చెబుతారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌మ పార్టీకి అవ‌స‌రం లేద‌ని.. త‌మ‌పై తీవ్ర‌స్తాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని. .ముఖ్యంగా టికెట్ ఇచ్చి గెలిపించిన జ‌గ‌న్‌పైనే విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని.. ఆయ‌న బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోర్టులో పిటిష‌న్ కూడా వేశార‌ని.. సాయిరెడ్డి స‌హా.. ఇత‌ర ఎంపీలు పేర్కొంటూ.. ఆయ‌న పార్ల‌మెంటు స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని స్పీక‌ర్‌కు ఏడాదిన్న‌ర కింద‌టే అప్పీలు చేశారు.

ఈ అన‌ర్హ‌త పిటిష‌న్ స్పీక‌ర్ ద‌గ్గ‌ర ఇప్ప‌టికీ పెండింగులో ఉంది. అయితే.. దీనిపై ఇటీవ‌ల స్పీక‌ర్ క్లారిటీ ఇచ్చారు. అనైతిక కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డలేదు క‌నుక‌.. రాజ‌కీయ కార‌ణాలు చూపుతూ.. ఆయ‌న‌పై వేటు వేయ‌లేమ‌ని పేర్కొంది. మ‌రోవైపు.. వైసీపీ నాయ‌కులు ర‌ఘురామ‌పై రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తూనే ఉన్నారు. ద‌మ్ముంటే.. రాజీనామా చేసి గెలువు.. అంటూ.. వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీనికి తాను సిద్ధ‌మేన‌ని..త‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డ‌మో..బ‌హిష్క‌రించ‌డ‌మో.. చేయాల‌ని ర‌ఘురామ కూడా డిమాండ్ చేస్తున్నారు.

అయితే.. ఈ డిమాండ్ పైనా.. వైసీపీ ఎక్క‌డా నిర్ణ‌యం తీసుకోలేదు. అంటే.. ర‌ఘురామ‌.. ఏపార్టీలో ఉన్న‌ట్టు.. వైసీపీలోనే క‌దా!! కానీ.. ఇప్పుడు.. సాయిరెడ్డి తాజాగా స్పీక‌ర్‌కు రాసిన లేఖ‌లో.. ఓ చిత్ర‌మైన విష‌యం ప్ర‌స్తావించారు. “ర‌ఘురామ కృష్ణ‌రాజు.. రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌ల‌కు చెందిన సంస‌ద్ టీవీ చానెళ్ల‌లో జ‌రిగే చ‌ర్చ‌ల్లో పాల్గొంటున్నారు. ఆయ‌న వైసీపీ పార్టీకి చెందిన నాయ‌కుడిగా ప‌రిచ‌యం చేసుకుంటున్నారు. కానీ, ఆయ‌న కు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు. కాబ‌ట్టి.. ఇక నుంచి ఆ టీవీ చాన‌ళ్ల చ‌ర్చ‌లో పాల్గొనకుండా చ‌ర్య‌లు తీసుకోండి. ప‌నిలో ప‌నిగా.. వ‌చ్చే లోక్‌స‌భ స‌మావేశాల్లో ఆయ‌న‌పై వేటు వేయండి” ఇదీ.. లేఖ సారాంశం.

క‌ట్ చేస్తే.. వైసీపీలో ర‌ఘురామ లేర‌ని.. సాయిరెడ్డి ఎలా చెబుతారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఆయ‌న పార్టీకి రిజైన్ చేయ‌లేదు. పోనీ.. జ‌గ‌న్ కానీ.. సాయిరెడ్డికానీ, ఆయ‌న‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించ‌లేదు. క‌నీసం స‌స్పెండ్ కూడా చేయ‌లేదు. సో.. ఆయ‌న వైసీపీ నాయ‌కుడిగానే టెక్నిక‌ల్‌గా కొన‌సాగుతున్నారు. ఇక‌, వేటు వేసేందుకు స‌రైన కార‌ణ‌మే లేద‌ని స్పీక‌ర్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టినా.. ఇంకా చిన్న‌పిల్లాడు చాక్లెట్ కోసం.. యాగీ చేసిన‌ట్టు.. సాయిరెడ్డి అన‌ర్హ‌త కోసం.. డిమాండ్ చేయ‌డం ఏమీ బాగోలేద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. క్లారిటీ అనేది ర‌ఘురామ విష‌యంలో బాగానే ఉందని.. లేనిద‌ల్లా వైసీపీ అధిష్టానానికేన‌ని అంటున్నారు.