బాబు కంటే… జగన్ సర్కారు తక్కువ అప్పులు చేస్తోందట

Buggana Rajender Reddy
Buggana Rajender Reddy

ఏపీ ని శ్రీ‌లంక‌తో పోల్చ‌ద్దు.. అది స‌బ‌బు కాదు. మేం అప్పులు చేసిన మాట వాస్త‌వ‌మే కానీ, తెలుగుదేశం పార్టీ క‌న్నా త‌క్కువ అప్పులు చేశాం.. అని అంటున్నారు ఆర్థిక శాఖ మంత్రి. ఇప్పుడు కొత్త అప్పుల గురించి, వాటి లెక్క‌ల గురించి అంత‌టా చ‌ర్చ వ‌స్తున్న వేళ అస‌లు తాము అప్పులు చేస్తున్న‌దే పాత బ‌కాయిలు తీర్చేందుకు అన్న అర్థం వ‌చ్చే విధంగా కొన్ని సంద‌ర్భాల్లో వైసీపీ నాయ‌కులు మాట్లాడుతున్నారు. ఒక అప్పు తీర్చి మ‌రో అప్పు తెస్తున్నారా అయితే అని విప‌క్షం అంటోంది.

సంక్షేమానికి కూడా నిధులు లేని ప‌రిస్థితుల్లో , కనీసం జీతాల చెల్లింపున‌కు కూడా నిధులు లేని సంద‌ర్భంలో ఆర్బీఐ దగ్గ‌ర ఓవ‌ర్ డ్రాఫ్ట్ (ఓడీ) పేరిట నిధులు లాక్కుంటున్నా ఖ‌జానాకు మాత్రం అవే మాత్రం స‌రిపోవ‌డం లేదు అని టీడీపీ దుయ్య‌బ‌డుతోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ య‌న‌మ‌ల లాంటి వారు చెబుతున్న లెక్క‌ల‌కూ, విప‌క్షం మాట‌లు విని కౌంట‌ర్లు ఇచ్చే వైసీపీ లెక్క‌ల‌కు పొంత‌న అన్న‌దే లేకుండా పోతోంద‌ని విమ‌ర్శ‌కులు అంటున్నారు.

ఏపీలో అప్పుల లెక్క‌లు రోజుకో మాదిరి విన‌ప‌డుతున్నాయి. ఉపాధి ప‌నుల విష‌య‌మై కానీ, విద్యుత్ బ‌కాయిల విష‌య‌మై కానీ ఏదో ఒక వార్త ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో చేసిన అప్పులు లేదా తీర్చ‌ని బ‌కాయిలు సైతం తామే తీరుస్తున్నామ‌ని లేదా తీర్చామ‌ని ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి చెబుతున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థ‌లు విద్యుత్ సంస్థ‌ల‌కు చెల్లించాల్సిన రెండు వేల రెండు వంద‌ల కోట్ల బ‌కాయిలు సైతం తామే తీర్చామ‌ని అంటున్నారు.

మ‌రోవైపు రాష్ట్రంలో ప‌న్నుల వ‌సూళ్లు పెరిగితే ఆర్థిక వృద్ధి ఉన్న‌ట్లే క‌దా ! అని కూడా ఆయ‌న చెబుతున్నారు. ఇవ‌న్నీ బాగానే ఉన్నాయి. అప్పులు లెక్క వ‌చ్చేట‌ప్ప‌టికీ తాము టీడీపీ క‌న్నా త‌క్కువ అప్పులే చేశామ‌ని అంటున్నారు. గత ప్ర‌భుత్వ హ‌యాంలో స‌గ‌టున అప్పు ( ఏడాదికి) 19.46 శాతం ఉంటే, త‌మ హ‌యాంలో 15.77 శాతంగానే ఉంద‌ని తేల్చారు. అలానే వ‌డ్డీ రేటు చూసుకున్నా కూడా 2014 -15 మ‌ధ్య స‌గ‌టు వడ్డీ రేటు ఎనిమిది శాతానికి పైగా ఉంటే, త‌మ హ‌యాంలో 2020 -21కి సంబంధించి అది ఏడు శాతం పైగా ఉంద‌ని గుర్తించాల‌ని అంటున్నారు.

చంద్రబాబు రాక ముందు అప్పు లక్షన్నర కోట్లు. 2014-19 కాలంలో చంద్రబాబు చేసిన అప్పు లక్ష పది కోట్లు. జగన్ వచ్చేనాటికి మొత్తం కలిపి 2.6 లక్షల కోట్లు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రాష్ట్రం అప్పు 6.5 లక్షల కోట్లు. అప్పు పెరుగుదలను శాతాల్లో చూపి మాయ చేయాలనే ఆలోచన భలే ఉంది బుగ్గన గారు. ఒకసారి మీ అప్పును అంకెల్లో చెప్పండి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దమ్ముంటే మొత్తం మీరు చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయమంటున్నాయి.