రేవంత్‌, రేణుక‌పై కేసుల పిడుగు

కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి సహా విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ కాలర్ పట్టుకున్నారని రేణుకా చౌదరిపై, ఆర్టీసీ బస్పై దాడి చేసి, ఉద్యోగిని బెదిరించినందుకు.. పలువురు నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

చలో రాజ్ భవన్ ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, భట్టి, మల్లు రవి, శ్రీధర్ బాబు, రేణుకా చౌదరి, వీహెచ్ వంటి నేతలు సహా 200మందిపై ఐపీసీ 143, 145, 147, రెడ్ విత్ 149, 120బి, 341, 336,427,152,153,353, 506, పిడిపిపి(ఇది చాలా అరుదైన సంద‌ర్భాల్లో వాడే సెక్ష‌న్‌) యాక్ట్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ ఉపేంద్ర ఆమెపై ఫిర్యాదు చేశారు. చలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా పంజాగుట్ట ఠాణా ఎస్ఐ రాజ్ భవన్ రోడ్డులో విధులు నిర్వర్తిస్తున్నారు. రాజ్ భవన్ మట్టడికి బయలు దేరిన మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆమెకు వాగ్వాదం జరిగింది.

ఆమెను పోలీసు వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నించగా.. ‘నన్నే అరెస్టు చేస్తారా’ అంటూ ఎదురుగా ఉన్న ఎస్ఐ ఉపేంద్ర బాబు కాలర్ పట్టుకున్నారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా విధుల్లో ఉన్న తనపై దురుసుగా ప్రవర్తించారంటూ ఎస్ఐ పంజాగుట్ట ఠాణాలో ఫిర్యాదు చేశారు.

ఖైరతాబాద్ కూడలి వద్ద ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్టీసీ బస్సును ధ్వంసం చేసిన ఘటనపై డ్రైవర్ సైతం పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు చేశారు. బస్సు అద్దాలు పగులగొట్టారని…బస్సును దగ్ధం చేస్తామని బెదిరించారని కాంగ్రెస్ కార్యకర్తలపై కాచిగూడ డిపోకు చెందిన 83జే బస్సు డ్రైవర్ బాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనల్లో సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు.