2024 ఎన్నికల్లో పోటీనుండి తప్పుకున్న ఎంఎల్ఏ

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ రాజమండ్రి అర్బన్ ఎంఎల్ఏ ఆదిరెడ్డి భవాని ప్రకటించారు. రాజమండ్రిలో మీడియాతో ఎంఎల్ఏతో పాటు ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తన భార్యకు బదులు తానే పోటీచేయబోతున్నట్లు శ్రీనివాస్ ప్రకటించేసుకున్నారు. తనను రాజమండ్రి ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబునాయుడు సూచించినట్లు శ్రీనివాస్ తెలిపారు.

చంద్రబాబు చెప్పినట్లు ఎంపీగా పోటీ చేసేంత స్ధోమత తమకు లేదు కాబట్టి ఎంఎల్ఏగా మాత్రమే పోటీచేయబోతున్నట్లు స్పష్టంగా చెప్పారు. పోయిన ఎన్నికల్లో కూడా తానే పోటీ చేయాల్సి ఉందన్నారు. అయితే సీటును మహిళకు కేటాయించినట్లు చంద్రబాబు చెప్పటంతో తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు ఆయన తెలిపారు. ఎంఎల్ఏ అభ్యర్ధిగా రాజమండ్రి నుండి తప్ప ఇంకెక్కడి నుంచి పోటీ చేసే ఆసక్తిలేదన్నారు. మొన్నటి ఎన్నికల్లో భవానీ 30 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు.

రాజమండ్రి నుండి పోటీ చేసే విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గేదేలేదని స్పష్టంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంలో తన మనసులోని మాటను, తన నిర్ణయాన్ని శ్రీనివాస్ ప్రకటించేశారు బాగానే ఉంది కానీ టికెట్ కేటాయించే చంద్రబాబు మనసులోని మాటేమిటో తెలీదు. వచ్చే ఎన్నికల్లో కూడా భవానీకే టికెట్ కేటాయించబోతున్నట్లు చంద్రబాబు చెబితే అప్పుడు శ్రీనివాస్ ఏమిచేస్తారు ? పార్టీ అధినేతపై ఒత్తిడితెచ్చి బీఫారంను తనపేరుపై మార్పించుకునేంత సీన్ శ్రీనివాస్ కు ఉందా ?

ఇదే విషయమై భవానీ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తేల్చి చెప్పేశారు. తన స్థానంలో తన భర్త పోటీచేస్తారన్నారు. మొన్నటి ఎన్నికల్లో తాను ఎందుకు పోటీచేయాల్సొచ్చిందనే విషయాన్ని భవానీ కూడా చెప్పారు. అంతా బాగానే ఉందికానీ వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయబోతున్నారనే విషయాన్ని అసలు చంద్రబాబుతో మాట్లాడారా అన్నది కీలకం. ఎందుకంటే ఎవరిష్టం ప్రకారం వాళ్ళు టికెట్లు ప్రకటించేసుకోవటం, కేటాయించేసుకోవటం సాధ్యం కాదు. శ్రీనివాస్ ను ఎంపీగా పోటీచేయమని చంద్రబాబు చెప్పారంటే ఏదో కసరత్తు చేసిన తర్వాతే చెప్పుంటారు. సరే ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో పోటీనుండి తాను తప్పుకుంటున్నట్లు భవానీ అయితే స్పష్టంగా ప్రకటించేశారు. చివరకు చంద్రబాబు ఏమంటారో ఆసక్తిగా మారింది.