పురందేశ్వ‌రీ.. పిచ్చి ప్ర‌య‌త్నాలు మానుకో.. : కొడాలి నాని

అన్న‌గారు ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిపై వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఫైర్ బ్రాండ్‌, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పురందేశ్వరి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని.. లేకుండా తీవ్ర పరిణామాలుంటాయని కొడాలి నాని హెచ్చ‌రించారు.

ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పురందేశ్వరి అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. అన్న ఎన్టీఆర్ రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గుడివాడ పురపాలక సంఘం కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

“ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ వల్లభనేని బాలశౌరిల కృషితో గుడివాడ ప్రజల సుదీర్ఘ సమస్య అయిన రైల్వే గేట్లపై ఫ్లైఓవర్లు మంజూరు అయ్యాయి. కేవలం 10 మంది వ్యాపారుల ప్రయోజనాల కోసం లక్షలాది మందికి ఉపయోగపడే ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం దారుణం. ఫ్లైఓవర్‌ నిర్మాణం ఆగిపోతే గుడివాడ మీదుగా వెళ్లే రైళ్లను అడ్డుకుంటాం. పురందేశ్వరి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలి. ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని కొడాలి నాని హెచ్చరించారు.

ఏం జ‌రిగింది?

ఇటీవ‌ల ఇక్క‌డ ప‌ర్య‌టించిన పురందేశ్వ‌రి.. బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజులు.. ఫ్లైవోవ‌ర్ నిర్మాణం అన‌వ‌స‌ర‌మ‌ని.. కొంద‌రు ముడుపుల కోస‌మే.. దీనిని తీసుకువ‌చ్చార‌ని.. ఈ విష‌యంపై తాము కేంద్రానికి లేఖ రాస్తామ‌ని.. వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పురందేశ్వ‌రి మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అరాచ‌కాల‌కు అడ్డు అదుపు లేకుండా పోతోంద‌ని.. కొడాలిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అదే స‌మ‌యంలో ఫ్లైవోవ‌ర్ కార‌ణంగా.. కోట్ల రూపాయ‌ల ముడుపులు ముట్టాయ‌ని.. దుయ్య‌బ‌ట్టారు. దీనికి ప్ర‌తిగా.. మాజీ మంత్రి కొడాలి స్పందిస్తూ.. పైవిధంగా ఫైర్ అయ్యారు. మ‌రిదీనికి పురందేశ్వ‌రి ఎలా కౌంట‌ర్ ఇస్తారో చూడాలి.