టీడీపీ నేత‌ల‌తో న‌డ్డా ర‌హ‌స్య భేటీ..?

ఏపీలో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షులు జేపీ న‌డ్డా.. పార్టీ గురించి పెద్ద ఎత్తున ఆశా భావం వ్య‌క్తం చేశారు. వైసీపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అవినీతి పెరిగిపోయింద‌ని అన్నారు. అదేస‌మ‌యంలో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. అయితే.. ఆయ‌న పొత్తుల విష‌యంలో ఎక్క‌డా ప‌న్నెత్తు మాట మాట్లాడ‌లేదు. అదేస‌మ‌యంలో త‌మ‌తో పొత్తులోనే ఉన్న జ‌న‌సేన పార్టీ విష‌యంలోనూ ఎక్క‌డా ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు.

ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ విష‌యంలోనూ న‌డ్డా బ‌హిరంగ వేదిక‌ల‌పై ఎక్క‌డా ప్ర‌స్తావ‌న చేయ‌లేదు. కానీ, ఇదే స‌మ‌యంలో అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు.. న‌డ్డాతో టీడీపీకి చెందిన కీల‌క నాయ కులు భేటీ అయిన‌ట్టు స‌మాచారం. వీరిలో టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన‌.. ప‌లువురు కీల‌క నాయ‌కులు ఉన్న‌ట్టు తెలిసింది. అదేస‌మ‌యంలో మాజీ మంత్రి, ప్ర‌స్తుతం టీడీపీలోనే ఉన్న విశాఖ ఫైర్ బ్రాండ్ ఉన్న‌ట్టు స‌మాచారం. అయితే.. ఈ స‌మావేశంలో ఏం చ‌ర్చించార‌నేది ఆస‌క్తిగా మారింది.

విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్‌లో న‌డ్డాతో వీరంతా భేటీ అయి దాదాపు గంట‌కు పైగానే చ‌ర్చించార‌ని తెలిసింది. ఈ చ‌ర్చ‌ల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల విష‌యంపైనే వారు స‌మాలోచ‌న‌లు జ‌రిపార‌ని తెలిసింది. నిజానికి టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉంద‌నే సంకేతాలు కొన్నాళ్లుగా వ‌స్తూనే ఉన్నాయి. ఈ విష‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల‌కుండా చూస్తాన‌ని చెబుతున్నారు.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు పొత్తుల విష‌యంలో టీడీపీని క‌లుపుకొని వెళ్తామ‌ని.. ఎక్క‌డా బీజేపీ ప్ర‌క‌టించ లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా న‌డ్డాతో జ‌రిగిన భేటీ అత్యంత ఆస‌క్తిగా మారింది. మ‌రోవైపు ఆర్ ఎస్ ఎస్ నుంచి కూడా టీడీపీని క‌లుపుకొని ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నే సూచ‌న‌లు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ఇదిలావుంటే, రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో నిర్వ‌హించిన బీజేపీ సింహ గ‌ర్జ‌న స‌భ‌లో న‌డ్డా మాట్లాడుతూ.. టీడీపీని విమ‌ర్శించ‌క‌పోవ‌డం.. పైగా బ‌స్సు మిస్స‌యింద‌నే వ్యాఖ్య‌లు చేయ‌డం.. వంటివి రాబోయే రోజుల్లో టీడీపీతో బీజేపీ క‌లిసి ప‌నిచేస్తుంద‌నే సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.