వార‌సులొస్తున్నారు.. తెలంగాణ‌లో వేడెక్కిన పాలిటిక్స్‌

తెలంగాణ‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నికలుంటాయా, లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుత ప్రభుత్వానికి మరో ఏడాదిన్నర మాత్రమే సమయముంది. దీంతో వచ్చే ఎన్నికలు లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు పకడ్భందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో వారసుల రాజకీయ ఆరంగేట్రానికి  గ్రేటర్‌లోని నేతలు పావులు కదుపుతున్నారు.

ఇప్పటికే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల వారసులు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలు, నేతలు తాము తప్పుకొని వారసులను బరిలో దింపాలని భావిస్తుండగా, ఇంకొందరు తమతోపాటు పిల్లలకూ అవకాశం దక్కేలా పావులు కదుపుతున్నారు.

విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి  తనయుడు కార్తీక్‌రెడ్డి రాజేంద్రనగర్‌ నుంచి పోటి చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే కార్తీక్ రెడ్డి తన వద్దకు వచ్చే ప్రజలకు వివిధ పనులకు సంబంధించి మాట సాయం చేస్తున్నారు. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జి. సాయన్న వీలైతే.. కూతురు, మాజీ కార్పొరేటర్‌ లాస్య నందితను బరిలో నిలపాలని భావిస్తున్నారు.  ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఇతర నేతలూ ఆసక్తి చూపుతున్నారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి త‌న‌ తనయుడు, టీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఇన్‌చార్జి సాయికిరణ్‌ యాదవ్‌ను  మరోసారి పోటీ చేయించే ఆలోచనలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఉన్నారు.

ముషీరాబాద్‌  ప్రస్తుత ఎమ్మెల్యే ముఠా గోపాల్ తనయుడు జైసింహను బరిలో నిలిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అనంతరం గోపాల్‌ కోలుకున్నా.. ప్రతి కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు జైసింహ ఉంటున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు, మాజీ కార్పొరేటర్‌ శ్రీనివా‌స్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. నాయిని నరసింహా రెడ్డి ఫౌండేషన్‌ ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్   తనయుడు అనిల్‌కుమార్‌ యాదవ్  మరోసారి బరిలో నిలిచే అవకాశముంది. బీజేపీ తరపున పోటీ చేసేందుకు గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఆసక్తి చూపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ మరోసారి పోటీ చేయాలనుకుంటోన్న నేపథ్యంలో టికెట్‌ ఎవరికి దక్కుతుందున్నది ఆసక్తికరంగా మారింది. సికింద్రాబాద్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే, డిప్యూటి స్పీకర్‌ టి. పద్మారావుగౌడ్‌..  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనయుడు రామేశ్వర్‌గౌడ్‌ను పోటీ చేయించాలని యోచిస్తున్నట్టు సమాచారం. పద్మారావు అందుబాటులో లేని సమయంలో అధికారులు, పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతుంటారు.

గోషామహల్‌ నుంచి మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రం గౌడ్‌ బీజేపీ తరఫున మరోసారి బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటి చేసిన ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్‌ను తన సిటింగ్‌ స్థానం నుంచి పోటి చేయించే యోచనలో ఉన్నట్టు సమాచారం. నిజామాబాద్‌ నుంచి బరిలో నిలిచేందుకు హన్మంతరావు ఆసక్తి చూపుతున్నారు. ఇద్దరికి అవకాశం ఇస్తే.. రెండు చోట్లా గెలిచి చూపిస్తామని పార్టీ పెద్దలకు చెప్పినట్టు తెలిసింది.

మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ అన్న కుమారుడు కాసాని వీరేష్‌.. టీఆర్‌ఎస్‌  తరఫున కుత్బుల్లాపుర్‌ నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక్కడ కేపీ వివేకాంద అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి  తనయుడు రవికుమార్‌ బీజేపీ తరఫున బరిలో దిగాలని భావిస్తున్నాడు. మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్ గతంలో చేవేళ్ల పార్లమెంట్‌ నుంచి పోటీ చేశారు. బీజేపీలో చేరిన ఆయన మహేశ్వరం అసెంబ్లీ లేదా చేవేళ్ల లోక్‌సభ  స్థానంలో బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సనత్‌నగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి  రెండో తనయుడు పూరూరవ రెడ్డి ఈసారి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. శశిధర్‌రెడ్డి తప్పుకొని కుమారుడికి అవకాశం ఇస్తారా, లేక పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా..? అన్నది చూడాలి. మొత్తంగా.. కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌, బీజేపీల నుంచి వార‌సులు భారీ సంఖ్య‌లో రంగంలోకి దిగుతుండ‌డం కొత్త‌వారికి.. ప్రాధాన్యం భారీగా త‌గ్గిపోయే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇది అన్ని పార్టీల‌కూ మంచిది కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.