ఈ రాజ్యసభ సీటు వెనుక కథ ఇదేనా?

తెలంగాణాకు చెందిన ఎంతో మంది బీజేపీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేసుకున్నా రాజ్యసభ ఎంపీగా పనిచేసే అవకాశం డాక్టర్ లక్ష్మణ్ నే వరించింది. లక్ష్మణ్ దశాబ్దాలుగా పార్టీలోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఓబీసీ జాతీయ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో తెలంగాణా అధ్యక్షుడిగా, రెండుసార్లు ముషీరాబాద్ ఎంఎల్ఏగా కూడా ఈయన పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో ముషీరాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయారు.

ఎంఎల్ఏగా ఓడిపోయిన తర్వాతే ఈయనకు పార్టీ అగ్రనాయకత్వం జాతీయ స్థాయి పదవి కట్టబెట్టింది. అయితే ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్ష పదవిలో లక్ష్మణ్ ఎలాంటి సేవలు అందించారో మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రిగా అమిత్ షా యే ఇటు ప్రభుత్వాన్ని అటు పార్టీని నడిపిస్తున్నారు. నిజానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకే పెద్దగా పనిలేదు. ఇక పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నేతలకు పనేముంటుంది ?

సొంత రాష్ట్రం తెలంగాణలో కూడా లక్ష్మణ్ ఓబీసీలతో పెద్ద సమావేశం పెట్టినట్లు కూడా లేరు. నిజానికి లక్ష్మణ్ ను ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు నామినేట్ చేయటం అన్నది పార్టీకి లాభించే అంశం కానేకాదు. ఎందుకంటే తెలంగాణాలో పార్టీ బలోపేతానికి డాక్టర్ చేసిందేమీలేదు. ఈ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం పార్టీలో అసలు ఊపన్నదే లేదు. ఇదే సమయంలో పార్టీలో గ్రూపు తగాదాలు బాగా పెరిగిపోయాయి. చాలామంది సీనియర్లు లక్ష్మణ్ ను అసలు పార్టీ అధ్యక్షుడిగానే గుర్తించలేదు.

పార్టీకి జవసత్వాలు అందించటం లక్ష్మణ్ వల్ల కాదని అర్ధమైపోయిన అగ్రనాయకత్వం చివరకు ఈయన్ను తప్పించి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు పగ్గాలు అప్పగించింది. ఎప్పుడైతే బండికి పగ్గాలు అప్పగించారో అప్పటినుండే పార్టీకి జనాల్లో ఒక్కసారిగా ఊపువచ్చేసింది. స్వతహాగానే దూకుడు స్వభావం ఉన్న బండి రకరకాల కార్యక్రమాలతో, పాదయాత్రల పేరుతో జనాల్లో దూసుకుపోతున్నారు. బండి విషయంలో కూడా సీనియర్లలో తీవ్ర అసంతృప్తి ఉందన్నది వాస్తవమే. అయితే  ఆ విషయాన్ని బండి పట్టించుకోకుండా తన కార్యక్రమాలతో జనాల్లో వెళిపోతున్నారు. ఈ పని లక్ష్మణ్ చేయలేకపోయారు. కాకపోతే విధేయతను మాత్రమే అగ్రనాయకత్వం గుర్తించినట్లయ్యిందంతే.