చంద్రబాబు మాట నిలబెట్టుకుంటారా?

తెలుగుదేశం పార్టీ మరో 40 ఏళ్ళు ఇదే ఉత్సాహంతో ఉండాలంటే పార్టీలో యువతకు పెద్ద పీట వేయాల్సిందే అని చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకనే పార్టీలోకి కొత్త రక్తం ఎక్కించటంలో భాగంగానే టికెట్లలో 40 శాతం యువతకే కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎక్కడ మాట్లాడినా పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా లోకేష్ మాట్లాడుతూ రెండు సార్లకన్నా పదవుల్లో ఉండేందుకు లేదన్నారు. తాను కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటానన్నారు.

ఒకళ్ళకి ఒకటే పదవి పరిమితం చేయబోతున్నట్లు చెప్పారు. యువతకు పెద్దపీట వేయకపోతే పార్టీలో ఉత్సాహం ఎలా వస్తుందని లోకేష్ ప్రశ్నించారు. నిజానికి ఇలాంటి ఫార్ములా 2019 ఎన్నికల్లోనే అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. అయితే ఏవో కారణాల వల్ల కుదరలేదు అపుడు. మళ్ళీ ఇపుడు అదేమాట చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇప్పుడున్న సీనియర్లలో అత్యధికులు ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు నవ యువకులే. దశాబ్దాల రాజకీయం తర్వాత వృద్ధులైపోయారు.

వీళ్ళని పక్కన పెట్టడం చంద్రబాబు వల్ల కావటంలేదు. యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, బండారు సత్యనారాయణమూర్తి లాంటి కొన్ని వందల మంది సీనియర్లు పార్టీలో పాతుకుపోయున్నారు. ఉంటే వీళ్ళు లేకపోతే వీళ్ళ వారసులు మాత్రమే యువత కోటాలో టికెట్లు తీసుకోవాలని అనుకుంటున్నారు. చంద్రబాబు మొహమాటాన్ని పక్కనపెట్టి సీనియర్లతో పాటు వాళ్ళ వారసులను కూడా పక్కన పెట్టగలిగితే పార్టీలోకి కొత్త రక్తం వచ్చినట్లవుతుంది.

కొత్త యువతను గుర్తించి పికప్ చేస్తేనే కొత్త రక్తం ఉరకలెత్తుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా పార్టీలో దూకుడు పెరుగుతుంది. ఇపుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటోందో టీడీపీ కూడా సేమ్ టు సేమ్ సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. దాన్ని అధిగమించాల్సిన సమయం కూడా ఇపుడు వచ్చేసింది. ఇపుడు అధిగమించలేకపోతే భవిష్యత్తులో అధిగమించే అవకాశముండదు. ఎందుకంటే చంద్రబాబుతో పాటు పార్టీకి రాబోయే ఎన్నికల్లో అత్యంత కీలకమైనవి. అందుకనే చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడుంటే పార్టీకి జవసత్వాలు వస్తాయి. లేకపోతే లేదంతే.