హిందూపురంలో బాల‌య్య‌కు నో ఎంట్రీ

శ్రీస‌త్య‌సాయి జిల్లాలోని హిందూపురంలో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే, న‌టుడు.. నంద‌మూరి బాల‌య్య‌ను ఇక్క‌డ ప‌ర్య‌టించేందుకు పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు.. ఆయ‌న వెళ్లేందుకు వీలు లేదంటూ.. పోలీసులు.. నిలిపివేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది.

ఏం జ‌రిగింది?

శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. పాత కక్షల నేపథ్యంలో తెలుగుదేశం మాజీ సర్పంచ్ బాలాజీ ఇంటిపైకి వైసీపీ వర్గీయులు రాళ్లు రువ్వారు. అడ్డొచ్చిన టీడీపీ శ్రేణులను.. కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. క్షతగాత్రుల ను చిలమత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బాల‌య్య ఎందుకు వ‌చ్చారు?

చిల‌మ‌త్తూరులో జ‌రిగిన వైసీపీ, టీడీపీ వ‌ర్గీయుల దాడిలో గాయ‌ప‌డిన టీడీపీ నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను ప‌రామ‌ర్శించేందుకు బాల‌కృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పర్యటనకు వ‌చ్చారు. అయితే.. చిలమత్తూరు మండలం కొడికొండ వద్ద బాలక్రిష్ణను పోలీసులు అడ్డుకున్నారు.  కొడికొండలో మూడు రోజుల క్రితం జరిగిన జాతర టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు దారితీసింద‌ని.. ఈ ఘర్షణలో గాయపడ్డ టీడీపీ నేతలను పరామర్శించేందుకు వ‌చ్చాన‌ని బాలక్రిష్ణ చెప్పినా.. పోలీసులు స‌సేమిరా అన్నారు.

చివ‌ర‌కు బాల‌య్య‌ప‌ట్టుబ‌ట్ట‌డంతో గ్రామంలోకి కన్వాయి వద్దని కేవలం ఎమ్మెల్యే బాలక్రిష్ణ వాహనాన్ని మాత్రమే పోలీసులు అనుమ‌తించారు. బాలక్రిష్ణ రాకతో భారీగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు ఆయ‌న‌ను అనుస‌రించేందుకు కూడా పోలీసులు అనుమతించ‌లేదు.

బాల‌య్య ఫైర్‌

ఈ సంద‌ర్భంగా బాల‌య్య మాట్లాడుతూ… టీడీపీ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండించారు. గ్రామాల్లో కక్షలు రేపే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. మళ్లీ మా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. మేం కూడా తిరగబడుతాం.. ఖబడ్దార్ మీకు తగిన శాస్తి చేస్తాం అని హెచ్చ‌రించారు. ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ ను తరిమికొట్టే పరిస్థితి వచ్చిందన్నారు.  వైసీపీ   ప్రభుత్వంలో అభివృద్ధి లేదు.. అంతా బాదుడే బాదుడు అని విరుచుకుప‌డ్డారు. మట్టి నుంచి అన్నింటా దోపిడీ పర్వమే కొనసాగుతోందని విమ‌ర్శించారు.