విజయవాడలో లాక్‌డౌన్.. పెట్టినట్లే పెట్టి

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో మళ్లీ లాక్ డౌన్ పెట్టడం గురించి నిన్న సాయంత్రం నుంచి తెగ చర్చ నడుస్తోంది. తమిళనాడులో కొన్ని సెలెక్టివ్ సిటీలు, టౌన్లలో లాక్ డౌన్‌ పెట్టినట్లే ఏపీలో విజయవాడలో లాక్ డౌన్ పెడుతున్నట్లు నిన్న మధ్యాహ్నం నుంచి ప్రచారం మొదలైంది. సాయంత్రం నిజంగానే లాక్ డౌన్ ప్రకటన చేశారు కూడా. కలెక్టర్ ఇంతియాజ్ పేరుతో ప్రెస్ నోట్ కూడా మీడియాకు రిలీజ్ చేశారు.

విజయవాడలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం.. అక్కడి నుంచి కృష్ణా జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు కూడా వైరస్ విస్తరిస్తుండటంతో లాక్ డౌన్ అనివార్యమైందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి వారం పాటు లాక్ డౌన్ అమలవుతుందని.. ఈ నేపథ్యంలో బుధ, గురు వారాల్లో అవసరమైన సరకులన్నీ జనాలు కొని తెచ్చుకోవాలని.. ఈ వారం రోజుల పాటు ఎవ్వరూ బయటికి రాకూడదని.. పకడ్బందీగా లాక్ డౌన్ అమలవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఐతే ఈ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే అధికార యంత్రాంగం యుటర్న్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. లాక్ డౌన్ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా తర్వాత కొత్త ఉత్తర్వులు వచ్చాయి. విజయవాడలో పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేయబోతున్నామని.. వాటి ఫలితాల్ని బట్టి, మరి కొన్ని రోజులు పరిస్థితిని సమీక్షించి ఆ తర్వాత లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు మంగళవారం రాత్రి వచ్చాయి.

లాక్ డౌన్‌ నేపథ్యంలో సరకులన్నీ ముందే తెచ్చుకోవాలని ఆదేశాలివ్వడంపై ఆందోళన వ్యక్తమవడంతోనే ఉత్తర్వులు వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారానికి పరిమితం కాకుండా లాక్ డౌన్ కొనసాగితే పరిస్థితి ఏంటన్న ఉద్దేశంతో జనాలు ప్యానిక్ బయింగ్‌కు వెళ్తారని.. ఈ రెండు రోజుల్లో పెద్ద ఎత్తున మార్కెట్ల మీద పడతారని.. దాని వల్ల కరోనా వ్యాప్తి మరింత పెరుగుతుందని.. ఇంత హడావుడిగా నిర్ణయం ప్రకటించడం కరెక్ట్ కాదని భావించి ఉత్తర్వులు వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.