పెట్రోల్ ధ‌ర‌లు మీ ఇష్ట‌మేనా?: ప్ర‌ధాని ప్ర‌శ్న‌

తాజాగా దేశ‌వ్యాప్తంగా ఉన్న ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌ర్చువ‌ల్‌గా భేటీ అయ్యారు. అయితే.. దీనికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌రు కాలేదు. ఆయ‌న టీఆర్ ఎస్ ప్లీన‌రీలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో అటు ఏపీ, ఇటు తెలంగాణ‌లకు ప్ర‌ధాని మోడీ గ‌ట్టి ప్ర‌శ్న సంధించారు. ముఖ్యమంత్రుల సమావేశంలో పెట్రో ధరల అంశాన్ని ప్రస్తావించారు ప్రధాని. సామాన్యులకు ఊరట కలిగించేలా గతేడాది నవంబర్లో కేంద్రం పెట్రో ఉత్పత్తులపై రూ.10 చొప్పున‌ ఎక్సైజ్ సుంకం తగ్గించిందని గుర్తుచేశారు.

రాష్ట్రాలూ అదే తరహాలో పన్నులు తగ్గించాలని అప్ప‌ట్లోనే తాము కోరినట్లు ప్ర‌ధాని గుర్తు చేశారు. అయితే.. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆ పని చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. “నేను ఎవరినీ విమర్శించడం లేదు“ అంటూనే చుర‌క‌లు అంటించారు. ఏపీ తెలంగాణ‌ల్లో పెట్రోల్ ధ‌ర‌లు మీ ఇష్ట‌మేనా? అని న‌వ్వుతూ ప్ర‌శ్నించారు. అంతేకాదు…. మహారాష్ట్ర, బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఝార్ఖండ్, తమిళనాడు ప్రభుత్వాలు ధ‌ర‌లు త‌గ్గించ‌లేద‌న్నారు..

ఇక‌పై అయినా… ప్ర‌జ‌ల కోసం.. ఆయా ప్ర‌భుత్వాలు వ్యాట్ తగ్గించి, సామాన్యులకు లబ్ధి చేకూర్చాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు మోడీ. అయితే.. ఈ విష‌యం అప్ర‌స్తుత‌మ‌ని.. బెంగాల్ సీఎం మ‌మ‌త అక్క‌డే ప్ర‌శ్నించారు. “ఈజ్ దిస్ రైట్ డ‌యాస్ టు డిస్క‌స్ ఎబౌట్ హైక్‌“ అని ఆమె ప్ర‌శ్నించారు. దీంతో ప్ర‌ధాని స‌ర్దుకున్నారు. ఇక‌, దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చ‌ర్చించారు.

ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. కేసుల పెరుగుదలతో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదనే విషయం స్పష్టమైందన్నారు మోడీ. ఇతర దేశాలతో పోలిస్తే కరోనాను దేశంలో మెరుగ్గా అదుపు చేయగలిగామని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు మనం అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. దేశంలో దాదాపు 96శాతం మంది వయోజనులు వ్యాక్సిన్ వేసుకున్నారని, ఇది గర్వించదగ్గ విషయం అన్నారు. ఇక‌, ఏపీలో జ‌రుగుతున్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన‌న్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మెచ్చుకున్నారు.