ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం

ఏపీలో రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ స్కీం పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేయాలంటూ పదే పదే డిమాండ్లు చేస్తున్నారు. సీపీఎస్ ను వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు సీపీఎస్ రద్దు చేయమని జగన్ డిమాండ్ చేశారు. తాను కనుక సీఎం అయితే వారంలో సీపీఎస్ రద్దు చేస్తాను అన్నాడు. కానీ జగన్ సీఎం కాగానే ప్లేటు ఫిరాయించాడు. మూడేళ్ల తర్వాత.. అయ్యో ప్రభుత్వం వద్ద అంత డబ్బు లేదు అని చావు కబురు చల్లగా చెబుతున్నాడు. 

అయినా ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వానికి ఊపరి ఆడటం లేదు. దీనిపై ప్రభుత్వం అనేక సమీక్షలు చేసి తాజాగా గ్యారెంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్) పద్దతిని అమలు చేస్తామని ప్రతిపాదించింది. సీపీఎస్-జీపీఎస్ పద్దతుల్లోని లాభనష్టాలపై ఇటు ప్రభుత్వం అటు ఉద్యోగ సంఘాల మధ్య సరైన సర్దుబాటు కావటం లేదు.

సీపీఎస్ ను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వం తాజాగా జీపీఎస్ విధానాన్ని ప్రతిపాదించింది. అయితే దీన్ని కూడా ఉద్యోగులు అంగీకరించటం లేదు. తమందరికీ ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీం విధానమే బెస్టంటు ఉద్యోగులు చెబుతున్నారు. సీపీఎస్ విధానంలో ఉద్యోగులతో పాటు ప్రతినెలా ఇంతని ప్రభుత్వం కూడా కొంతమొత్తం జమచేయాల్సుంటంది. దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుందని ఉద్యోగులే అంటున్నారు.

అదే ఓపీఎస్ విధానంలో అయితే ఉద్యోగి వాటానే తప్ప ప్రభుత్వం వాటాయే ఉండదట. కాబట్టి ఓపీఎస్ విధానమే తమకు ఆమోదయోగ్యమని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సీపీఎస్ విధానంలో రిటైర్ అవుతున్న ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాల వల్ల ప్రభుత్వంపై విపరీతమైన ఆర్ధిక భారం పడుతోందని ఉద్యోగులంటున్నారు. 2035కి 21,576 మంది రిటైర్ అవుతారట. అందుకుగాను సీపీఎస్ విధానంలో ప్రభుత్వం ఏడాదికి చెల్లించాల్సిన మొత్తం రు. 4,331 కోట్లు. అదే ఓపీఎస్ విధానంలో రు. 1445 కోట్లే జమచేయాలి. అదికూడా ఉద్యోగుల వాటానే తప్ప ప్రభుత్వం వాటా ఉండదంటున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పెన్షన్ స్కీం అనేది పూర్తిగా ఉద్యోగులకు సంబంధించింది. ఇందులో ప్రభుత్వానికి భారం లేనపుడు, అమల్లో ఎలాంటి సమస్యలు లేనపుడు వాళ్ళు కోరుకున్న విధానాన్నే అమలు చేయచ్చు. రాజస్థాన్, ఛత్తీస్ గడ్ ప్రభుత్వాలు సీపీఎస్ విధానంలో ఓపీఎస్ పద్దతిని తీసుకొచ్చాయట. కాబట్టి ఆ ప్రభుత్వాలతో మాట్లాడితే మన అధికారులకు క్లారిటి వస్తుంది. దాంతో అవసరమైన మార్పులు ఏవైనా చేసి ఉద్యోగులు అడుగుతున్నట్లే ఓపీఎస్ విధానాన్నే అమలుచేస్తే సమస్య ఉండదుకదా.