మోడీకి సీఎం  స్టాలిన్ భారీ షాక్‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం!

యూనివర్సిటీల వైస్ చాన్సెల‌ర్ల‌(వీసీ)లను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది స్టాలిన్ ప్రభుత్వం. రాష్ట్ర గవర్నర్కు ఉన్న అధికారాల్లో కోత విధించింది. ఈ సందర్భంగా 2010లో మాజీ సీజేఐ మదన్‌ మోహన్‌ పూంఛీ నేతృత్వంలోని కమిషన్‌ ఇచ్చిన నివేదికను స్టాలిన్‌ ప్రస్తావించారు. ఈ ప‌రిణామం.. ఇప్ప‌టి వ‌రకు ప్ర‌భుత్వంపై అంతో ఇంతో ఆధిప‌త్య ధోర‌ణితో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు సూచ‌న‌ల మేర‌కు న‌డుస్తున్న గ‌వ‌ర్న‌ర్‌కు బిగ్ షాకేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్సిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి  ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బిల్లుపై మాట్లాడారు.

” సంప్రదాయం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి గవర్నర్‌ వర్సిటీల వైస్‌ ఛాన్సలర్లను నియమిస్తారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా గవర్నర్లు దాన్ని తమ ప్రత్యేక హక్కు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రభుత్వాన్ని అగౌరవపర్చడమే గాక, ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధం. అంతేగాక, వైస్‌ ఛాన్సలర్ల నియామకం విషయంలో ప్రభుత్వానికి అధికారం లేకపోవడం ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విశ్వవిద్యాలయ పాలనా వ్యవహారాల్లోనూ గందరగోళం సృష్టిస్తోంది“ అని స్టాలిన్ అన్నారు.

ఈ సందర్భంగా 2010లో మాజీ సీజేఐ మదన్‌ మోహన్‌ పూంఛీ నేతృత్వంలోని కమిషన్‌ ఇచ్చిన నివేదికను స్టాలిన్‌ ప్రస్తావించారు. యూనివర్సిటీల ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్‌ను తొలగించాలని ఆ కమిటీ సిఫార్సు చేసినట్లు గుర్తుచేశారు. ‘అంతెందుకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనూ వీసీలను గవర్నర్‌ నేరుగా నియమించరు. రాష్ట్ర ప్రభుత్వ కమిటీ సిఫార్సు చేసిన ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరిని వీసీగా ఎంచుకుంటారు’ అని స్టాలిన్‌ అన్నారు.

తమిళనాడులోని రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్ల సదస్సు  ప్రారంభమైంది. ఈ సదస్సును రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రారంభించారు. ఇదే సమయంలో స్టాలిన్‌ ప్రభుత్వం గవర్నర్‌ అధికారాల్లో కోత విధించేలా బిల్లు తీసుకురావడం గమనార్హం. అయితే, ఈ బిల్లును ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, అన్నాడీఎంకే వ్యతిరేకించగా.. పీఎంకే పార్టీ సమర్థించింది. మ‌రి దీనిపై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ఏం చేస్తుందో చూడాలి.