రాజ‌ధానిపై వైసీపీ రిస్క్‌లేని కొత్త గేమ్‌…!

రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నులు ప్రారంభమ‌య్యాయి. ఇది ఊహించ‌ని సంఘ‌ట‌న‌. ఎందుకంటే.. అమ‌రావ‌తిని మార్చి మూడు రాజ‌ధానుల‌కు నిన్న మొన్న‌టి వ‌ర‌కు మొగ్గు చూపిన‌ వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యూహాన్ని మార్చుకునే దిశ‌గా అడుగులు వేస్తుండ‌డ‌మే!. ఇదే విష‌యంపై తాడేప‌ల్లి వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌సాగుతోంది. అనేక సంద‌ర్భాల్లో మూడు రాజ‌ధానుల కే తాముక‌ట్టుబ‌డి ఉన్నామ‌ని.. ప‌రోక్షంగా ప్ర‌త్య‌క్షంగా కూడా జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. వికేంద్రీక‌ర‌ణ విష‌యంలో తాము వెన‌క్కి  త‌గ్గేది లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

అంటే మూడు రాజ‌ధానుల‌కే ఆయ‌న క‌ట్టుబడి ఉన్నాన‌నేది సుస్ప‌ష్టం చేశారు. కానీ, ఇప్పుడు అమ‌రావతి ప‌నులు ప్రారంభించారు. కూలీల‌కు రైతులు పువ్వులు ఇచ్చి స్వాగ‌తం కూడా ప‌లికారు. దీనికి కార‌ణం.. కోర్టుల నుంచి అమరావ‌తికే అనుకూలంగా తీర్పులు రావ‌డం. ఈనేప‌థ్యంలో జ‌గ‌న్ ఇప్పుడు ఏం చేయాలి?  ఏంచేస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఈ క్ర‌మంలో ఆయ‌న న్యాయ‌స‌ల‌హా తీసుకుని.. ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించు కున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఈ స‌మ‌యంలోనే.. విజ‌య‌వాడ‌, గుంటూరు న‌గ‌రాల‌నే.. రాజ‌ధానులుగా.. అంటే జంట న‌గ‌రాలుగా మార్చే వ్యూహంపై జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల ఈ విష‌యంపైనా.. ఆయ‌న చూచాయ‌గా.. కీల‌క నేత‌ల‌కు సంకేతాలు పంపారు.

అమరావ‌తి అయితే.. విజ‌యవాడ‌కు 40 కిలోమీట‌ర్ల దూరంలో ఉంద‌ని.. అదేవిధంగా గుంటూరుకు కూడా 25 కిలోమీట‌ర్ల దూరంలో ఉంద‌ని చెప్పుకొచ్చారు. సో.. అలా కాకుండా..ఈ రెండు రాజ‌ధానుల్లో ఒక‌దానిని ఎంపికచేసుకుని పాల‌నా ప‌ర‌మైన రాజ‌ధానిని ఏర్పాటు చేస్తే.. అమ‌రావ‌తి నుంచి కూడా విమ‌ర్శ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ని.. అన్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు.. విజ‌య‌వాడ‌, గుంటూరుల‌ను రాజ‌ధానులుగా ప్ర‌క‌టిస్తే.. ఇత‌ర ప్రాంతాల వారికి కూడా ర‌వాణా సౌక‌ర్యంతోపాటు.. ఎలాంటి ఇబ్బందులు రావని అంచ‌నా వేస్తున్నారట‌. అయితే.. రాజ‌ధాని విష‌యంలో కోర్టు తీర్పును అమ‌లు చేయాల‌ని కూడా భావిస్తున్నార‌ట‌.

దీనికి పాల‌క‌పార్టీలోని మెజారిటీ నాయ‌కులు కూడా అనుకూలంగా ఉన్న‌ట్టు చెబుతున్నారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు విశాఖను పాల‌నా రాజ‌ధానిగా ప్ర‌క‌టించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఇంత‌లో.. న్యాయ‌స్థానం నుంచి తీర్పు.. అమ‌రావ‌తి రైతులకు అనుకూలంగా వ‌చ్చింది. ఈ క్ర‌మంలో.. విజ‌య‌వాడ‌, లేదా గుంటూరు న‌గ‌రాల్లో ఒక‌దానిని ఎంపిక చేసుకుంటే.. అటు అమ‌రావ‌తిపై త‌న పంతం నెగ్గించుకున్న‌ట్టు ఉంటుంది.. డెవ‌ల‌ప్ చేయ‌డం ద్వారా.. కోర్టు తీర్పు గౌర‌వించిన‌ట్టు కూడా ఉంటుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం కొత్త కేబినెట్ కొలువు దీర‌డంతో … తొలి స‌మావేశంలోనే దీనిని చ‌ర్చించే విష‌యం ప‌రిశీలిస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి.