జనసేన అంటే వైసీపీకి చలిజ్వరం: నాగబాబు

ఏపీ ప్ర‌భుత్వంపై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఫైర‌య్యారు. జ‌న‌సేన అంటే.. వైసీపీకి చ‌లి జ్వ‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జ‌న‌సేన అంటే.. వైసీపీకి ఎందుకు అంత భ‌య‌ప‌డుతోందో త‌మ‌కైతే అర్ధం కావడం లేద‌న్నారు. వైసీపీకి ఉన్న ఆభ‌య‌మే.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌పై దాడులకు ప్రేరేపిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. తాజాగా రాజ‌మండ్రిలో ప‌ర్య‌టించిన నాగ‌బాబు.. వైసీపీ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు.

వైసీపీ ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని నాగబాబు తెలిపారు. రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనను ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన లీగల్ సెల్ సభ్యులు కలిశారు. ఆయా జిల్లాల్లో జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసులను నాగబాబుకు వివరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జన సైనికులు, మహిళలపై పోలీసులను ఉపయోగించి వైసీపీ నాయకులు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

సామాజిక బాధ్యతతో ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తుంటే వారిపై దాడులకు తెగబడుతున్నారని,  సంబంధం లేని కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసైనికులకు, వీర మహిళలకు న్యాయపరమైన అంశాల్లో జనసేన పార్టీ లీగల్ సెల్ సభ్యులు చేయూతనివ్వాలని కోరారు. పవన్ కల్యాణ్ భావజాలానికి అనుగుణంగా పని చేస్తున్న జన సైనికులను, వీర మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని నాగబాబు తెలిపారు.

“ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. ఒక నిబ‌ద్ధ‌త‌త కోసం ప‌నిచేస్తున్నారు. కొంద‌రిలాగా దోచుకునేందుకు ఆయ‌న పార్టీ పెట్ట‌లేదు. అందుకే.. కౌలు రైతుల కుటుంబాలను క‌లుస్తున్నారు. ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. ఈ ప‌రిణామాలు.. పార్టీకి మేలు చేస్తాయి. అదేస‌మ‌యంలో వైసీపీ.. జ‌న‌సేన‌ను టార్గెట్ చేయ‌డం వెనుక భ‌య‌మే ఉంది. ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా.. స‌వాళ్లు ఎదురైనా.. పార్టీ ఖ‌చ్చితంగా గెలిచి తీరుతుంది“ అని నాగ‌బాబు వ్యాఖ్యానించారు.