న‌న్ను మాజీ మంత్రి అని పిల‌వొద్దు: కొడాలి నాని

ఏపీలోని వైసీపీ ప్ర‌బుత్వంలో ప‌నిచేసిన మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు కొడాలి నాని త‌న‌ను మాజీమంత్రి అని పిల‌వొద్ద‌ని .. మీడియాకు గ‌ట్టిగా చెప్పారు. తాజాగా ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో పదవి కోల్పోయిన తర్వాత నియోజకవర్గంలో తొలిసారి ఆయ‌న అడుగు పెట్టారు. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు, అభిమానులు కొడాలి నానికి ఘన స్వాగతం పలికారు.

విగ్రహావిష్కరణ అనంత‌రం నిర్వ‌హించిన‌ బహిరంగ సభలో కొడాలి నాని మాట్లాడుతూ..  గుడివాడ ఎమ్మెల్యేగా ఉండటమే తనకు ఇష్టమ‌ని అన్నారు. మాజీమంత్రి అని పిలవద్దని మీడియాకు సూచించారు. అలా రాయొద్ద‌ని కూడా చెప్పారు. మంత్రి పదవి వెంట్రుక ముక్కతో సమానమ‌ని అన్నారు. ఎమ్మెల్యే పదవి పోతేనే బాధపడతాన‌ని చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు పదవి కోసం దేవుడు లాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడుస్తారని, తనకు జగన్ వెనుక పని చేయడమే ముఖ్యమ‌ని నాని చెప్పారు.

420 గ్యాంగ్ , చంద్రబాబు దత్త పుత్రుడు, సొంత పుత్రుడు, రాష్ట్రం శ్రీలంక అవుతుందని విషప్రచారం చేస్తున్నారని కొడాలి త‌న సాధార‌ణ భాష‌లో మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను పోగొట్టుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్నారు. దేవుడులాంటి వైఎస్ఆర్ ను కోల్పోవడంతోనే రాష్ట్రం రెండు ముక్కలై సర్వనాశనం అయ్యిందని మ‌రో కీల‌క కామెంట్ చేశారు. బాబూ జగజ్జీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బతికున్నంతకాలం ప్రజాప్రతినిధిగా ఉండేందుకు ప్రయత్నిస్తాన‌ని కొడాలి స్ప‌ష్టం చేశారు.  

చంద్రబాబుకు వయసు అయిపోయి ఎప్పుడెం మాట్లాడుతున్నాడో తెలియడం లేదని కొడాలి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ తెల్ల మొఖం వేసుకొని రాష్ట్రంలో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని, ఎంపీ సురేష్ లను గ్రామస్తులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. అయితే.. మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించిన త‌ర్వాత‌.. జ‌రిగిన తొలి కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వంపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తారేమోన‌ని.. అంద‌రూ అనుకున్నా.. అలాంటి ఛాయ‌లు లేకుండా మాట్లాడ‌డం గ‌మ‌నార్హం.