కేంద్రం కేసీఆర్ ను లైట్ తీసుకుంటుందా?

Etela

గులాబీ ముఖ్యనేతలకు కోపం తన్నుకొస్తోంది. తాము ఎంతలా తగ్గి ఉన్నా.. అదే పనిగా బీజేపీ నేతలు కెలకటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా బీజేపీ అగ్ర నేతల్లో ఒకరు.. మోడీషాలకు సన్నిహితుడైన నడ్డా తెలంగాణ ప్రభుత్వం తీరును తప్పు పట్టటమే కాదు. మహమ్మారిని కంట్రోల్ చేయటంలో విఫలమయ్యారంటూ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ నేతలకు కోపం తెప్పించింది. లాక్ డౌన్ వేళ.. కేసీఆర్ తీరు అదిరిపోయేలా ఉందన్న పొగడ్తలతో పాటు.. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసుల నమోదు తక్కువగా ఉండటంతో ఊపిరి పీల్చుకునే పరిస్థితి.

ఎప్పుడైతే లాక్ డౌన్ సడలింపులు మొదలయ్యాయో.. అప్పటినుంచి కేసుల నమోదు ఎక్కువైంది. దీనికి తోడు మిగిలిన రాష్ట్రాల్లో మాదిరి నిర్దారణ పరీక్షలు చేయటంలోనూ తెలంగాణ సర్కారు తీసుకున్న విధానపరమైన నిర్ణయం కూడా విమర్శలకు తావిచ్చేలా చేసింది. ఇదే సమయంలో ఊహించని రీతిలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరగటమే కాదు.. ఇప్పుడు ఆందోళన చెందే స్థాయికి చేరుకున్న పరిస్థితి.

గురి చూసి దెబ్బ కొట్టిన చందంగా.. మొన్నటి వరకూ మహమ్మారిని కంట్రోల్ చేయటంలో తమకు మించినోళ్లు లేరన్నట్లుగా వ్యవహరించిన గులాబీ నేతలకు.. తాజాగా పెరుగుతున్న కేసుల సంఖ్యలో ఏం మాట్లాడాలో పాలుపోని పరిస్థితి. ఇదే సమయంలో.. తెలంగాణ రాష్ట్ర సర్కారు తీరు ఏ మాత్రం బాగోలేదంటూ బీజేపీ రాష్ట్ర నేతలతో కలిపి జాతీయ నేత స్వరం తోడు కావటంతో గులాబీ నేతలు ఇరుకున పడిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి తమ అమ్ములపొదిలో ఉండే భావోద్వేగ అస్త్రాన్ని బయటకు తీశారు. కేంద్రం కేసీఆర్ సర్కారును ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తోందని.. వారేం చేసినా సర్లేనని హుందాగా చూస్తున్నట్లుగా కొత్త వాదనల్ని తెర మీదకు తీసుకొచ్చారు.

టెస్టుల సామర్థ్యాన్ని పెంచే ఓ అత్యాధునిక వైద్య పరికరాన్ని తెలంగాణ ప్రభుత్వం విదేశాల నుంచి ఆర్డర్ చేసిందని.. ఆ పరికరాన్ని తమకు తెలీకుండా చెన్నై నుంచి పశ్చిమబెంగాల్ కు తరలించినట్లుగా మంత్రి ఈటెల వాదిస్తున్నారు. అసలు విషయం ఏమంటే.. ఆ యంత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వటానికి రాంకీ సంస్థ బుక్ చేసింది. అది కాస్తా కేంద్రం కోరటం తో కోల్ కతాకు ఇచ్చేశారు. అయినా.. ఆరేడు కోట్ల రూపాయిల ఖర్చు చేసే ఆ మెషీన్ ను సంపన్న రాష్ట్రమైన తెలంగాణ ఇప్పటివరకూ తెప్పించకుండా ఎందుకు ఉన్నట్లు?

మార్చి చివరి నాటికి మహమ్మారి పరిస్థితి అర్థమైన వేళ.. అప్పటికప్పుడు టెస్టుల అవసరాన్ని గుర్తించి ఇలాంటి మెషీన్లను రెండు.. మూడు ఈపాటికే ఎందుకు తెప్పించనట్లు? అన్నది ప్రశ్న. ఇక.. తాము వెయ్యి వెంటిలేటర్లు కోరితే కేంద్రం మాత్రం యాభై పంపినట్లుగా మండిపడుతున్నారు. కేంద్రానికి ధీటుగా తాము పథకాల్ని అమలు చేస్తామని చెప్పుకునేటప్పుడు.. వెంటిలేటర్లు ఇవ్వకుంటే తెలంగాణ సర్కారు సొంతంగా ఏర్పాటు చేసుకోవచ్చు కదా?

కేంద్రం తమ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తుందని.. నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్న భావన కలిగితే.. అప్పటికప్పుడే లెక్క తేల్చేయాల్సిందిపోయి.. ఎందుకు దాచుకున్నట్లు? తెలంగాణను.. రాష్ట్ర సీఎం కేసీఆర్ ను కేంద్రం లైట్ గా తీసుకుంటే నిలదీయటంలో తప్పేముంది? దాన్ని దాచి పెట్టాల్సిన అవసరం ఏముందన్నది ప్రశ్న. ఈ రోజున బీజేపీ నేతలు విమర్శించినంతనే.. ఎదురుదాడి చేసేందుకు పాత విషయాల్ని తవ్వటం వల్ల టీఆర్ఎస్ సర్కారుకు వచ్చే ప్రయోజనం పెద్దగా ఉండదన్న సత్యాన్ని మర్చిపోకూడదు. న్యాయంగా.. నిబంధనలకు అనుగుణంగా కేంద్రం నుంచి రావాల్సినవి రాని పక్షంలో వాటి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అదేమీ చేయకుండా తమ తప్పుల్ని ఎత్తి చూపించినంతనే కేంద్రాన్ని నిందించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు.