తెలంగాణలో టెస్టులు చేయకపోవటం వెనుక ఓవైసీ?

దేశమంతా ఒకలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర సర్కారు మరోలా వ్యవహరించటం ఏమిటన్న విమర్శలు తరచూ వినిపించేవి. మహమ్మారి ఎపిసోడ్ లో నిర్దారణ పరీక్షలు ఎక్కువగా చేయటం ద్వారా వైరస్ వ్యాప్తి ఏ రీతిలో సాగుతుందన్న విషయాన్ని అర్థం చేసుకునే వీలుంటుంది. అందుకు భిన్నంగా అసలు పరీక్షలు చేసే విషయాన్నే వదిలేస్తే.. రోగ లక్షణాలు తెలిసేదెలా? అన్నది ప్రశ్న.

మహమ్మారి నిర్దారణ పరీక్షలు చేయటం ద్వారా.. వ్యాధి మొదట్లో ఉన్నప్పుడే గుర్తించే వీలు ఉంటుంది. దీని ద్వారా వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంటుంది. కానీ.. ఈ చిన్న విషయాల్ని వదిలేసిన తెలంగాణ రాష్ట్ర సర్కారు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. కేసుల సంఖ్య ఎక్కువైన వేళలో పరీక్షల్ని నిర్వహిస్తోంది. అది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన తర్వాతే.

ఇంతకీ తెలంగాణ ప్రభుత్వం నిర్దారణ పరీక్షలు ఎందుకు చేయలేదు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి. తాజాగా ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి. మహమ్మారి కట్టడికి సంబంధించి దక్షిణ భారతదేశంలోనే హైదరాబాద్ ప్రమాదకరంగా మారిందన్నారు. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర సర్కారు అనుసరించిన విధానమేనని ఆయన ఆరోపిస్తున్నారు.

కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు.. స్నేహితుడైన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వద్దన్నందుకే కేసీఆర్ నిర్దారణ పరీక్షలు నిర్వహించలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కరోనా టెస్టులు చేయకపోవటానికి కారణం మజ్లిస్ అని.. అందుకే కేంద్ర సహకారంతో తెలంగాణలో పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.

ఢిల్లీలోనూ కేంద్రం జోక్యం చేసుకొని ఆరు లక్షల పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పిన కిషన్ రెడ్డి మాటలు చూస్తుంటే.. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ పెద్ద ఎత్తున నిర్దారణ పరీక్షలు చేయటానికి బీజేపీ రంగంలోకి దిగుతుందన్న విషయాన్ని తనదైన శైలిలో ఆయన సంకేతాలు ఇచ్చారని చెప్పక తప్పదు. కిషన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ఈ సంచలన ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ తీరులో రియాక్ట్ అవుతారో చూడాలి.