40 వసంతాల వేదిక‌గా.. ఆత్మ‌స్థుతేనా.. ఆత్మావ‌లోక‌నం ఉంటుందా?

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఆవిర్భ‌వించి.. మ‌రో మూడు రోజుల్లో.. 40 ఏళ్లు పూర్తికానున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో ప్ర‌స్తుతం ఉన్న‌వాటిని గ‌మ‌నిస్తే.. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న త‌మిళ‌నాడు అధిక‌కార పార్టీ త‌ర్వాత టీడీపీనే ఉంది. మ‌రీ ముఖ్యంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీల్లో టీడీపీనే సీనియ‌ర్ మోస్ట్‌. తెలంగాణ‌లో ఉన్న టీఆర్ ఎస్ కానీ, ఏపీలో ఉన్న వైసీపీ కానీ.. టీడీపీ ముందు.. జూనియ ర్లే. ఈ నేప‌థ్యంలో ఈ రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు కూడా టీడీపీ 40వ వ‌సంత వేడుక‌లు.. ఈ సంద‌ర్భంగా చేసు కునే తీర్మానాల‌పై ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే.. ప్ర‌తిఏటా నిర్వ‌హించే టీడీపీ మ‌హానాడుకు ఒక ప్ర‌త్య‌క‌త ఉంది. అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాంలో మ‌హానాడుకు ఉన్న ప్ర‌త్యేక‌తే వేరు. అయితే..  కొన్నేళ్లుగా.. మ‌హానాడు ప్ర‌హ‌స‌నంగా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది. కేవ‌లం మ‌హానాడు వేదిక‌గా.. చంద్ర‌బాబును, ఆయ‌న విజ‌న్‌ను కొనియాడ‌డం.. పాల‌న‌ను మెచ్చుకోవ‌డం వ‌ర‌కే నాయ‌కులు ప‌రిమిత‌మ‌వుతున్నారు. అంతేకాదు.. కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని.. మ‌రీ.. బాబు ను ఆకాశానికి ఎత్తేసేందుకు పోటీ ప‌డుతున్నారు.

దీంతో మ‌హానాడు.. అంటే.. తిన‌డం. పొగ‌డ‌డం అనే పేరు వ‌చ్చింది. కానీ, క్షేత్ర‌స్తాయిలో మాత్రం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మ‌హానాడు నుంచి చాలానే ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఈ 40 వ‌సంతాల వేడుక వేదిక‌గా.. వారు. కొన్ని ఎక్స‌పెక్టేష‌న్స్ పెట్టుకున్నారు. అన్ని చోట్ల పార్టీ బ‌ల‌ప‌డాల‌ని..ఒంట‌రిగా పోటీచేసినా.. పార్టీ పుంజుకుని.. అధికారంలోకి వ‌చ్చే రేంజ్‌లో ఉండాల‌నే విష‌యాల‌పై వీరు చ‌ర్చించుకుంటున్నారు. అయితే.. ఈ అంశాల‌పై అధినాయ‌క‌త్వం దృష్టి సారించ‌డం లేద‌ని క్షేత్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వున్నాయి.  

ఈ నేప‌థ్యంలో మ‌హానాడు విష‌యంలో చాలా ఆశ‌లు పెట్టుకున్న‌వారు.. నిరాశ వ్య‌క్తం చేస్తున్న ప‌రిస్థితి ఉంది. ఈ క్ర‌మంలో తాజాగా జ‌ర‌గ‌నున్న 40 వ‌సంతాల వేడుక‌లో అయినా.. రాబోయే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ అధినేత చంద్ర‌బాబు దిశానిర్దేశం చేయాల‌ని .. త‌మ్ముళ్లు కోరుతున్నారు. అంతేకాదు.. క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేలా.. అన్ని సామాజిక వ‌ర్గాల‌ను పార్టీవైపు ఆక‌ర్షించేలా.. బ‌ల‌మైన పునాదులు ప‌డేలా.. క‌నీసం 20 ఏళ్ల‌పాటు పార్టీ చెక్కుచెద‌రని.. బ‌లంతో అధికారంలోకి వ‌చ్చేలా చేసేందుకు అనువైన ప్ర‌ణాళిక‌.. వ్యూహం ఈవేదిక మీద నుంచే చేయాల‌ని వారు కోరుతున్నారు.

అదేవిధంగా గ‌తంలో అన్న‌గారు.. నాయ‌కుల‌ను సామాన్యుల నుంచి ఎన్నుకునేవారు. కానీ, ఇటీవల కాలంలో  వార‌సుల‌ను ఎంచుకునే ప‌రిస్తితి కొన‌సాగుతోంది. దీంతో క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేస్తున్న నాయ‌కులు.. కార్య‌క‌ర్త‌ల‌కు అవ‌కాశాలు చిక్క‌డం లేదు. తాజాగా  జ‌రుగుతున్న‌40 వ‌సంతాల వేడుక‌లో మ‌ళ్లీ సామాన్యుల నుంచి నాయ‌కుల‌ను ఎంచుకునే దిశ‌గా చంద్ర‌బాబు ఆలోచ‌న చేయాల‌ని కోరుతున్నారు. ఆత్మ‌స్థుతి క‌న్నా.. ఆత్మావ‌లోక‌నం దిశ‌గా సాగితేనే.. 40 వ‌సంతాల వేడుక‌కు అర్ధం ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.