సరిహద్దుల్లో వాయుసేన భారీ మొహరింపు వ్యూహం ఏమిటి?

ఆచితూచి అడుగులు వేసే రోజులు పోయాయి. విషయం ఏదైనా తేల్చుకోవాలన్నప్పుడు అమీతుమీ అన్నట్లుగా దూకుడుగా.. దుందుడుకుగా వ్యవహరించినోళ్లదే ఇప్పుడు హవా నడిపిస్తున్నారు. దేశంలో కావొచ్చు.. ప్రపంచంలోని మరే ప్రాంతంలోనైనా కావొచ్చు. అందుకే.. ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. సమీకరణాలు కొత్తగా సమీకరించుకోవాల్సిన పరిస్థితి. ప్రత్యర్థి ఎవరన్న దాని కంటే.. ఎలా బదులిస్తామన్న విషయాన్ని చాటి చెప్పే సరికొత్త రణనీతిని ప్రదర్శిస్తోంది మోడీ సర్కారు.

గడిచిన నాలుగైదు దశాబ్దాల్లో ఇప్పటి మాదిరి చైనాతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్నది లేదు. దాయాది పాక్ తో రచ్చే కానీ.. ఎంతకైనా సై అన్నట్లు సంకేతాలు చైనాకు పంపటం మాత్రం ఇదే తొలిసారి.

ఎందుకిలా? అన్నది అసలు ప్రశ్న. గల్వామాలో చైనా దురాగతంపై యావత్ దేశం రగిలిపోతోంది. ఎన్నాళ్లీ బెదిరింపులు..? ఏమైతే అదే చూసుకుందామన్నట్లుగా చాలామంది నోట వినిపిస్తున్న మాటకు తగ్గట్లే.. వారి ఆశలకు.. ఆకాంక్షలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో మోడీ సర్కారు స్పందన ఉంటుందన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. వాస్తవానికి మోడీకి కానీ.. మోడీ సర్కారుకు కానీ కావాల్సింది అదే.

భారత్ మంచితనాన్ని మెతగ్గా తీసుకునే ధోరణి మార్చాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కేంద్రం గుర్తించినట్లుంది. ఈ కారణంతోనే.. గతానికి భిన్నంగా చైనా విషయంలో సరికొత్త ఎత్తులకు శ్రీకారం చుట్టినట్లుగా కనిపిస్తోంది. గల్వామా దురాగతం చోటు చేసుకున్నంతనే.. సరిహద్దుల్లో ఉండే సైనికులు పైవారి ఆదేశాలతో పని లేకుండా తాము ఏమనుకుంటే దాన్ని అమలు చేసే విశేష అధికారాన్ని జారీ చేశారు. అక్కడితో ఆగకుండా భారత్ అమ్ములపొదిలోని కీలకమైన సుఖోయ్ 30, ఎంకేఐ.. మిరాజ్ 2000.. జాగ్వార్ యుద్దవిమానాలతో పాటు.. ఇటీవల అమెరికా నుంచి సమకూర్చుకున్న అధునాతన అపాచీ హెలికాఫ్టర్లను సరిహద్దుల్లో మొహరించింది భారత్.

పైనుంచి ఆదేశాలు వచ్చినంతనే స్పందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కశ్మీర్ తోపాటు సిక్కిం.. అసోం.. అరుణాచల్ ప్రదేశ్ లకు మరిన్ని యుద్ధ విమానాల్ని తలిరంచారు. ఎందుకిందంతా? యుద్ధం చేయాలన్న ఆలోచన లేనప్పుడు ఇంత హడావుడి ఎందుకు? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వస్తోంది. ఇంతకాలం ఏం చేసినా భారత్ నుంచి ఆచితూచి స్పందనే తప్పించి..దూకుడు నిర్ణయాలు తక్కువన్న భావనను చెరిపివేయాలన్నది మోడీ సర్కారు యోచనగా చెప్పాలి.

తక్కువగా అంచనా వేస్తే మీకే నష్టమన్నసంకేతంతో పాటు.. మాకు నష్టం జరిగితే.. మీకు మాత్రం జరగదా? అన్న ప్రశ్న డ్రాగన్ కు కలిగేలా చేస్తున్నారని చెప్పాలి. తోక జాడితే.. కట్ చేసేందుకు ఏ మాత్రం సంశయించమన్న సందేశాన్ని కలిగించేందుకే ఇంత హడావుడి జరుగుతుందని చెప్పక తప్పదు.