రేవంత్‌కు ఫ్రీడం.. వాళ్ల‌కు చెక్‌?

తెలంగాణ కాంగ్రెస్‌లోని విభేదాల‌పై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. టీపీసీసీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత రాష్ట్రంలో పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్న రేవంత్‌రెడ్డికే హైక‌మాండ్ అండ‌గా నిలిచేందుకు సిద్ధ‌మైంది. అందుకే రేవంత్‌పై అసంతృప్తితో ఉన్న నేత‌ల విష‌యంలో క‌ఠిన వైఖ‌రి అవ‌లంబించాల‌ని అధిష్ఠానం నిర్ణ‌యం తీసుకుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రేవంత్‌పై దాడి చేస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డిని పీసీసీ అద‌న‌పు బాధ్య‌త‌ల నుంచి తొల‌గించ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

రేవంత్‌కు అండ‌గా..
తెలంగాణ‌లో కాంగ్రెస్ క్షేత్ర‌స్థాయిలో బ‌లం ఉంది. కానీ పార్టీ బ‌లోపేతంపై మాత్రం సీనియ‌ర్ నాయ‌కులు దృష్టి సారించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలో టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి పార్టీ బ‌లోపేతంపై దృష్టి సారించారు. మ‌రోవైపు రాష్ట్రంలో బ‌లంగా ఎదుగుతున్న బీజేపీకి అడ్డుక‌ట్ట వేయాల‌నే ల‌క్ష్యంతో పార్టీపై ఆయ‌న ఫోక‌స్ పెట్టారు. కానీ ప‌దే ప‌దే పార్టీలోని సీనియ‌ర్ నేత‌ల నుంచి అసంతృప్తి రేవంత్‌కు అడ్డుగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ఢిల్లీలో రాష్ట్ర వ్య‌వ‌హారాల బాధ్యుడు మాణికం ఠాగూర్‌కు రేవంత్ అన్ని విష‌యాలు వివ‌రించార‌ని తెలిసింది. ఈ నేప‌థ్యంలో హైక‌మాండ్ రేవంత్‌కు అండ‌గా ఉంటామ‌ని పూర్తి భ‌రోసానిచ్చిన‌ట్లు స‌మాచారం.

నో అపాయింట్‌మెంట్‌..
రేవంత్‌పై ఆగ్ర‌హంతో ఉన్న సీనియ‌ర్ల బృందం ఒక‌టి హైక‌మాండ్‌ను క‌లిసేందుకు ఢిల్లీ వెళ్లింది. కానీ ఈ అసంతృప్తి నేత‌ల విషయాన్ని అధిష్ఠానం చాలా లైట్‌గా తీసుకుంద‌ని స‌మాచారం. రేవంత్‌కు వ్య‌తిరేకంగా పార్టీ పెద్ద‌ల‌కు ఫిర్యాదు చేయాల‌ని వెళ్లిన కొంత‌మంది సీనియ‌ర్ నాయ‌కుల‌కు అపాయింట్‌మెంట్ దొర‌క‌లేద‌ని తెలుస్తోంది.

రెండు మూడు రోజులు అక్కడే ఉన్నా.. ముఖ్యనేతలు మాత్రం వీరిని కలవలేదని సమాచారం. దీంతో తెలంగాణ పార్టీ వ్య‌వ‌హారాల్లో రేవంత్‌కు అధిష్ఠానం పూర్తి స్వేచ్ఛ‌నిచ్చింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణారాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌నే సంకేతాల‌ను రేవంత్ త్వ‌ర‌లోనే ఇస్తార‌ని తెలిసింది. అందుకోసం సీనియ‌ర్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు షోకాజ్ నోటీసులు అందించేందుకు టీపీసీసీ సిద్ధ‌మ‌వుతోంద‌నే ప్ర‌చారం జోరందుకుంది.