జ‌గ‌న్‌కు లేని స‌మ‌స్య కేసీఆర్‌కు ఎందుకు?

గ‌త కొద్దినెల‌లుగా కేంద్ర ప్ర‌భుత్వం వ‌ర్సెస్ కేసీఆర్ స‌ర్కారు అన్న‌ట్లుగా విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ఎపిసోడ్‌లో న‌డుస్తున్న టాపిక్ ధాన్యం సేక‌ర‌ణ‌. తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిన రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌తో చ‌ర్చించారు. అనంత‌రం వ్య‌వ‌సాయ‌ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మళ్లీ పాతపాడే పాడారని, యాసంగి వడ్ల కొనుగోలుపై క్లారిటీ ఇవ్వలేదని ఆరోపించారు. అయితే, దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది.

తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి పెద్ద ఎత్తున వ‌స్తున్న విమ‌ర్శ‌లు, టీఆర్ఎస్ వ‌ర్గాల ఆందోళ‌న‌లు, ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌కు చెందిన బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రైతులను టీఆర్ఎస్ బలి చేస్తోందని, టీఆర్ఎస్ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని.. వారిని చూస్తే జాలేస్తోందని వ్యాఖ్యానించారు.

`వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రానిది మొదటినుంచి ఒకే మాట. ఇచ్చిన టార్గెట్ కూడా తెలంగాణ పూర్తి చేయలేదు. ఏ రైతు కూడా బాయిల్డ్ రైస్ తయారుచేయడు. బాయిల్డ్ రైస్ ఇవ్వం అని రాసిచ్చినప్పుడు ఇంగితం లేదా? బాయిల్డ్ రైస్ విషయంలో ఆంధ్రాకు లేని ఇబ్బంది తెలంగాణకు మాత్రం ఎందుకు వచ్చింది.?` అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

వడ్ల ఎగమతిలో ఇతర రాష్ట్రాలకు లేని సమస్య తెలంగాణకు మాత్రమే ఎందుకొస్తుందని కిష‌న్ రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు. “తప్పుడు ప్రచారం చేయడానికి టీఆర్ఎస్ నేతలకు నోరెలా వస్తుంది. రైతుల గురించి మీకు బాధ్యత లేదా? అసలు ఇంతవరకు ఎంత పంట సాగయిందో కూడా చెప్పలేదు. దేశానికో చట్టం.. తెలంగాణకో చట్టం ఉండదు. కానీ కేసీఆర్ మాత్రం సిద్ధిపేటకో చట్టం.. దుబ్బాకకో చట్టం అమలుచేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేసీఆర్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మంత్రులకు టార్గెట్ ఇచ్చి మరీ కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నారు.“ అంటూ కిష‌న్ రెడ్డి ఆక్షేపించారు.