కేసీఆర్ కింక‌ర్త‌వ్యం.. ఫ్రంట్‌కా? వెన‌క్కా?

అనుకున్న‌దొక్క‌టి.. అయిన‌ది ఒక్క‌టే.. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలా అనుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయిదు రాష్ట్రాల్లో బీజేపీకి దెబ్బ ప‌డుతుంద‌ని, ఒక‌వేళ యూపీలో గెలిచినా ఆద‌ర‌ణ త‌గ్గుతుంద‌ని కేసీఆర్ చెప్పారు. ఈ ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీ క్ర‌మంగా బ‌ల‌హీన‌ప‌డ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. మోడీపై దేశవ్యాప్తంగా వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌ని భావించిన ఆయ‌న‌.. జాతీయ రాజ‌కీయాల్లో ఆ పార్టీపై పోరు సై అన్నారు. కానీ ఇప్పుడు ఆయ‌న అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి.

మ‌ళ్లీ మోడీనే..
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌హా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డం ఖాయ‌మైంది. యూపీలో బీజేపీ సీట్లు త‌గ్గినా ఓట్ల శాతం పెరిగింది. 2024 సార్వ‌త్రిక  ఎన్నిక‌ల్లో విజ‌యానికి యూపీ ఎన్నిక‌లే పునాది అని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్న నేప‌థ్యంలో మూడోసారి మోడీ ప్ర‌ధాని కావ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో మోడీని దేశం నుంచి త‌రిమి కొట్టాల‌ని బ‌హ‌రంగ స‌భ‌లో తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తారోన‌న్న ఆస‌క్తి మొద‌లైంది. యూపీ, ఉత్త‌రాఖండ్‌, గోవా, మ‌ణిపూర్‌లో బీజేపీ విజ‌యం.. జాతీయ స్థాయిలో ప్ర‌త్యామ్నాయ కూట‌మి ఏర్పాటు కోసం కేసీఆర్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌పై క‌చ్చితంగా ప్ర‌భావం చూపుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఫ్రంట్ కోసం ప్ర‌య‌త్నాలు..
కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం దేశాన్ని స‌రైన దిశ‌లో న‌డిపించ‌డం లేద‌ని ఆ పార్టీని దేశం నుంచి త‌ర‌మికొట్టాల‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశం బాగు కోసం స్వ‌యంగా జాతీయ రాజ‌కీయ‌ల్లోకి వెళ్ల‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాంగ్రెసేత‌ర‌, బీజేపీయేత‌ర కూట‌మి దిశ‌గా ఏర్పాట్లు మొద‌లెట్టారు. బీజేపీ వ్య‌తిరేక శ‌క్తుల‌ను క‌లుస్తున్నారు. ఇప్పటికే మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేను, జార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్‌ను వాళ్ల రాష్ట్రాల‌కు వెళ్లి కేసీఆర్ క‌లిశారు. త‌మ‌ళినాడు, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రులు స్టాలిన్‌, మ‌మ‌తా బెన‌ర్జీతోనూ మాట్లాడుతున్నారు. కానీ తాజాగా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి వ‌చ్చిన ఫ‌లితాలు కేసీఆర్‌ను ఖంగు తినిపించాయ‌ని తెలుస్తోంది. పంజాబ్ మిన‌హా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ హ‌వా కొనసాగ‌డం కేసీఆర్‌కు ఊహించ‌ని ప‌రిణామంగా షాక్ ఇచ్చిందని టాక్‌.

త‌గ్గ‌డ‌మే మేల‌ని..
ప్ర‌స్తుత ప‌రిణామాల నేప‌థ్యంలో జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్ కాస్త వెన‌క్కి త‌గ్గే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.  ఈ విజ‌యాలు ఇచ్చిన జోష్‌తో మ‌రింత దూకుడుగా ముందుకు సాగే బీజేపీ నుంచి ర‌క్షించుకోవ‌డానికి ప్రాంతీయ పార్టీలు త‌మ రాష్ట్రాల‌పైనే ఫోక‌స్ పెట్టే అవ‌కాశం ఉంది. దీంతో ఇప్ప‌ట్లో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అనేది సాధ్యం కాక‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. దీంతో జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌వేశానికి కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా వెన‌క్కి త‌గ్గాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని టీఆర్ఎస్‌లోనే కొంత‌మంది నాయ‌కులు అభిప్రాయ‌ప‌డ్డ‌ట్లు స‌మాచారం. అనువైన రాజ‌కీయ వాతావ‌ర‌ణ లేన‌ప్పుడు ప‌రుగులు పెట్ట‌డం మంచిది కాద‌ని చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ బ‌లోపేతం కాకుండా క‌ట్ట‌డి చేయ‌డంపై ముందు దృష్టి సారించాల‌ని సూచిస్తున్నారు.