‘జాబులెక్కడ జగన్ రెడ్డి’…టీడీపీ ఎమ్మెల్యేల ర్యాలీ

Lokesh

తెలంగాణలోని నిరుద్యోగులకు ఊరటనిచ్చేలా సీఎం కేసీఆర్ జంబో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ చరిత్రలో ఉద్యోగాలకు సంబంధించి 91,142 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో, ఏపీలో జాబ్ క్యాలెండర్ చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే జగన్ నిరుద్యోగులను మోసం చేశారని, తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని టీడీపీ సహా విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే జగన్ తీరును నిరసిస్తూ టీడీపీ శాసనసభా పక్ష నేతలు అసెంబ్లీ దగ్గర ర్యాలీ చేపట్టారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ దగ్గర నిరసనకు దిగారు.  సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు టీడీపీ శాసనసభాపక్ష నేతలు భారీ ర్యాలీ చేపట్టి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

‘జాబులెక్కడ జగన్ రెడ్డి’ అంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. నిరుద్యోగుల్ని జగన్ మోసం చేశారని, కాంట్రాక్టు ఉద్యోగుల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణను చూసి ఏపీ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు.

ఏపీలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోందని, ప్రతిపక్ష నేతగా 2.5 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన జగన్…వారినిమోసగించారని ఫైర్ అయ్యారు. జగన్ హామీ ఇచ్చినట్టు రెండున్నర లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ ఆయన చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నారా లోకేశ్, కింజారపు అచ్చెన్నాయుడు, అశోక్ బాబు తదితర నేతలు పాల్గొన్నారు.