జగన్ పార్టీ వీక్ నెస్ తమ్ముళ్లకు తెలిసిపోయిందా?

చట్టసభలు సమావేశమైన వేళ.. అధికార విపక్షాలు ఎత్తులు పైఎత్తులు వేసుకోవటం కామన్. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షం.. ప్రతిపక్షానికి చుక్కలు చూపించాలని అధికారపక్షం తపిస్తుంటుంది. ఇలాంటివేళ.. అధికారపక్షం కాస్తంత సంయమనంతో వ్యవహరిస్తే.. ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరించటం మామూలే.

మారిన రాజకీయాలకు తగ్గట్లు.. విపక్షాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అధికారపక్షాలు తన సత్తా చాటటం కొన్నేళ్లుగా చూస్తున్నాం. ఇలాంటప్పుడు తెలివితో ఒకరినొకరు దెబ్బ కొట్టాలే కానీ కండబలాన్ని సభలో ప్రదర్శించటం ఏ మాత్రం సరికాదు.

అవసరం లేకున్నా ఒక పాయింట్ ను విపక్షం తీసుకొస్తుందంటే.. వారి లెక్క ఏమిటన్న విషయాన్ని అధికారపక్షం ఆలోచించాలి. గొడవ చేసుకోవాలన్నదే విపక్షం లక్ష్యమైతే.. వారు కోరుకున్నట్లుగా చేయటంతో ప్రయోజనం ఉండదు. కానీ..దూకుడుకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి సహనం లాంటివి ఆశించలేం. వారికున్న బలం.. బలహీనత అయినా ఆవేశాన్ని తమకు అనుకూలంగా వాడుకోవటం ద్వారా అధికారపక్షాన్ని ఇరుకున పడేలా చేయటంలో తెలుగు తమ్ముళ్లు సక్సెస్ అయ్యారని చెప్పాలి.

ఏ మాట అంటే అధికార పార్టీ రెచ్చిపోతుందో? గమనించి వారిని కంట్రోల్ తప్పేలా చేయటం మీద తమ్ముళ్లు భారీగానే కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. దీనికి తగినట్లుగానే బుధవారం ఏపీ శాసనమండలి సమావేశాలు జరిగాయని చెప్పాలి. అవసరం లేని విషయం మీద అనవసరంగా రచ్చ చేస్తున్న విపక్షం లక్ష్యం.. బిల్లులు ఆమోదం పొందకుండా ఉండటం లక్ష్యం కాదు.

సభలో అధికారపక్షం హద్దులు దాటేలా రెచ్చగొట్టటమే ఎజెండా అన్నది చెప్పక తప్పదు. బుధవారం చోటు చేసుకున్న కోట్లాటను చూస్తే.. అధికార పార్టీ నేతల వీక్ నెస్ ఏమిటన్న దానిపై తెలుగు తమ్ముళ్లు మంచి పట్టు సాధించారనే చెప్పాలి.

మాటలతో దారుణరీతిలో తిట్టుకుంటున్న స్థానే.. భౌతికదాడికి ప్రేరేపించేలా మంత్రుల్ని రెచ్చగొట్టిన తమ్ముళ్ల తీరు చూస్తే.. తాము విసిరిన ఉచ్చులో అధికారపక్షం పడేలా చేసిందని చెప్పాలి. తమ్ముళ్లు మొండిగా వ్యవహరించారని.. తొండి ఆట ఆడారని ఎంత ఆరోపించినా.. వారిపై దాడి చేసిన మచ్చ మాత్రం అధికారపక్షం మీద ఉండిపోతుందన్నది మర్చిపోకూడదు.

ఇదంతా చూసినప్పుడు నాలుగు దెబ్బలు తిన్నా.. అంతకు మించిన పాలిటికల్ మైలేజీ.. సానుభూతిని సొంతం చేసుకోవాలన్నదే తమ్ముళ్ల ఆలోచనగా ఉందన్న మాట అధికారపక్ష నేతలు కొందరు ఆఫ్ ద రికార్డుగా పేర్కొనటం గమనార్హం. జగన్ మంత్రుల వీక్ నెస్ లను తమ్ముళ్లు క్రాక్ చేసిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం జగన్ పార్టీ నేతల మీద ఉంది. లేకుంటే.. తమ్ముళ్ల మీద పట్టు సాధించటం తర్వాత.. తరచూ వారి చేతుల్లో అడ్డంగా బుక్ అయిపోవటం ఖాయం.