దేశంలో ఈ పరిణామాలు తప్పవు

ఎన్నికల ఫలితాలు వెలువడనున్న ఐదు రాష్ట్రాలపై అందరిలోనూ ఉత్కంఠ పెరిగిపోతోంది. మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలాగున్నా గోవాలో మాత్రం అప్పుడే క్యాంపు రాజకీయాలు మొదలైపోయాయి. గోవాలో మొన్నటి ఎన్నికల తర్వాత కూడా బాగా అనిశ్చితి ఏర్పడిన సంగతి తెలిసిందే. చివరకు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్న కారణంగా బీజేపీ గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఎంఎల్ఏల సంఖ్యాపరంగా తీసుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే విచిత్రం.

దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇపుడు కాంగ్రెస్ ముందు జాగ్రత్త పడింది. ఇదే సమయంలో బీజేపీ కూడా అలర్టవ్వటంతో క్యాంపు రాజకీయాలు మొదలైపోయాయి. గోవాలో ఉన్నదే 40 అసెంబ్లీ సీట్లు. ఇక్కడ ఎవరు అధికారంలోకి రావాలన్నా కనీసం 21 సీట్లు గెలుచుకోవాలి. ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్-బీజేపీకి చెరో 15-16 సీట్లు వస్తాయని తేలింది. ఇంకేముంది క్యాంపు రాజకీయాలకు తెర లేవడానికి సరిపడా వాతావరణం మొదలైపోయింది.

కాంగ్రెస్ తరపున సీనియర్ నేతలు పీ. చిదంబరం, దినేష్ గుండూరావు నాలుగు రోజులుగా గోవాలో క్యాంపేసున్నారు. అలాగే బీజేపీ ఇంచార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రంగంలోకి దిగేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రెండు రోజులుగా ఢిల్లీలో క్యాంపు వేశారు. నరేంద్ర మోడీ, అమిత్ షాతో చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ ఎంఎల్ఏ అభ్యర్ధులందిరినీ రిసార్టులకు తరలించేశారు. ఇదే సమయంలో మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, ఇండిపెండెంట్లతో కూడా కాంగ్రెస్, బీజేపీ నేతలు చర్చలు మొదలు పెట్టేశారు.

పెద్ద పార్టీల టెన్షన్  చూసి చిన్న పార్టీలు ఏకంగా ముఖ్యమంత్రి పదవిపైనే కన్నేశాయి. తమకు ముఖ్యమంత్రి పదవిని ఇస్తేనే తాము మద్దతిస్తానని గోమంతక్ పార్టీ కాంగ్రెస్, బీజేపీలకు తెగేసి చెప్పిందట. కాంగ్రెస్, బీజేపీలకు ఎగ్జిట్ పోల్స్ సర్వేలో చెప్పినట్లు సంపూర్ణ మెజారిటి రాకపోతే విషయం మరింత క్లిష్టంగా తయారవుతుంది. అప్పుడు చిన్న పార్టీల్లో ఏదైనా 5-6 సీట్లు గెలుచుకుంటుందో దాని పంట పండినట్లే అనుకోవాలి.