చైనాకు డబుల్ లాస్.. ధ్రువీకరించిన అమెరికా

రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినపుడు.. అవతలి వాళ్లే ఎక్కువ నష్టపోయారని.. తమకు జరిగిన నష్టం నామమాత్రమని ఆయా దేశాలు చెప్పుకుంటాయి. ఈ విషయంలో చైనా చేసే అతి గురించి అందరికీ తెలిసిందే. ప్రజాస్వామ్య దేశాలైతే యుద్ధంలో తమకు జరిగిన నష్టం గురించి బయటికి చెప్పక తప్పదు. మీడియాలో వార్తలొస్తాయి. అంతర్జాతీయ సమాజానికి విషయం తెలుస్తుంది. కానీ నియంతృత్వ పాలన ఉన్న చైనాలో ఏ సమాచారం బయటికి పొక్కనివ్వరు.

కరోనా విషయంలో ఎలా సమాచారాన్ని తొక్కి పెట్టి ప్రపంచాన్ని మాయ చేశారో తెలిసిందే. ఇక శత్రు దేశాలతో ఘర్షణ లేదా యుద్ధం జరిగినపుడు కూడా చైనా ఇదే తీరును అనుసరిస్తుంది. తమకు జరిగిన నష్టాన్ని బయటికి పొక్కనివ్వదు.

1962లో భారత్‌పై గెలిచిన యుద్ధం గురించి చైనా చెప్పుకుంటుంది కానీ.. 1967లో మన సైనికుల చేతిలో చావుదెబ్బ తిన్న ఉదంతాన్ని మాత్రం బయటికి రాకుండా చేయడానికి ప్రయత్నించింది. అప్పటి ఘర్షణలో వందల సంఖ్యలోనే చైనా తన సైనికుల్ని కోల్పోయిందన్నది చరిత్రకారులు చెప్పేమాట.

ఇక వర్తమానం విషయానికి వస్తే.. భారత్-చైనా సరిహద్దుల్లో కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. లద్దాఖ్ సమీపంలో తాజాగా జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. అందులో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నాడు.

ఐతే ఈ చిన్నపాటి యుద్ధంలో చైనా రెట్టింపు సంఖ్యలో సైనికుల్ని కోల్పోయినట్లు చెబుతున్నారు. కానీ చైనా ఈ విషయాన్ని అంగీకరించలేదు. భారత్ ఈ సంగతి చెబితే ప్రపంచం నమ్ముతుందో లేదో కానీ.. అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలు చెబితే దానికే క్రెడిబిలిటీ వస్తుంది. 40 మందికి పైగానే చైనా సైనికులు చనిపోయినట్లు భారత్ చెబుతుండగా.. అమెరికా నిఘా వర్గాలు కనీసం 35 మంది చైనా సోల్జర్జ్ చనిపోయినట్లుగా పేర్కొంటున్నాయి.

ఈ మేరకు యుఎస్‌న్యూస్.కామ్ వెబ్ సైట్లో కథనం కూడా ప్రచురితమైంది. ‘‘అమెరికా ఇంటలిజెన్స్ వర్గాల లెక్కల ప్రకారం దాదాపు 35 మంది చైనా సైనికులు చనిపోయారు. వీరిలో ఓ సీనియర్ అధికారి కూడా ఉన్నారు. బలగాల ఉపసంహరణపై సమావేశం జరుగుతుండగానే ఈ ఘర్షణ చోటు చేసుకుంది’’ అని ఆ వెబ్ సైట్ పేర్కొంది.