ఈ ఇద్దరు ఎటూ కాకుండా పోతారా ?

ఇపుడిదే విషయమై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. జాతీయ స్ధాయిలో మారిపోతున్న రాజకీయ సమీకరణల్లో ఏపీ పాత్ర ఎక్కడా కనబడటం లేదు. ఎన్డీఏ, యూపీయేయేతర పార్టీలతో  కూటమి కట్టేందుకు ప్రయత్నాలు జోరందుకున్న విషయం అందరికీ కనబడుతోంది. ఒకవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మరోవైపు కేసీయార్ చాలా స్పీడు మీదున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు.

వీళ్ళందరు వచ్చే ఎన్నికల్లో సమావేశం అవటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు కనబడుతున్నాయి. తమతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా కలుపుకోవాలని తటస్త ముఖ్యమంత్రులు ప్రయత్నిస్తున్నారు. కేజ్రీవాల్ కూడా వీరికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్డీయే, యూపీఏ కూటమి తమను తాము కన్సాలిడేట్ చేసుకునేందుకు భాగస్వామ్య పక్షాలతో రెగ్యులర్ గా సమావేశాలు పెట్టుకుంటున్నాయి.

ఈ మొత్తం వ్యవహారంలో అందరూ కలిసి ఏపీని వదిలేసినట్లే అనుమానంగా ఉంది. ఏ రాజకీయ పక్షం కూడా జగన్మోహన్ రెడ్డితో కానీ లేదా చంద్రబాబు నాయుడుతో కానీ టచ్ లోకి వస్తున్నట్లు లేదు. చంద్రబాబు అన్ని పార్టీలకు ప్రస్తుతం సమ దూరం పాటిస్తుండటం వల్ల కేసీఆర్ కి చంద్రబాబు అంటే పడకపోవడం అతన్ని సంప్రదించడం లేదు. మరి అధికారంలో ఉన్న జగన్ తో టచ్ లోకి రావాలి కదా. సీఎంను కూడా ఎవరూ ఎందుకని టచ్ చేయటం లేదు ?

ఎందుకంటే జగన్ పై న చాలామందికి నమ్మకం లేనట్లుంది. జగన్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా తమతో చేతులు కలిపేంత సీన్ లేదని మమత, కేజ్రీవాల్, కేసీయార్ కు అర్ధమైపోయినట్లుంది. జగన్ పై ఉన్న కేసులు, చంద్రబాబుకు ఉన్న రాజకీయ అనివార్యతల కారణంగానే కూటమికి దూరంగా ఉన్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోడీకి లేదా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. ఈ విషయాన్ని గడచిన ఎనిమిదేళ్ళుగా యావత్ దేశం చూస్తూనే ఉంది. పోనీ నరేంద్ర మోడీ అయినా వీళ్ళిద్దరికీ ఇవ్వాల్సినంత ప్రాదాన్యతిస్తున్నారా అంటే అదీ లేదు. అందుకనే చివరకు జగన్, చంద్రబాబు చివరకు ఏ కూటమికీ కాకుండా పోతారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.