పోలీస్ స్టేషన్లో ఎంపీ సురేష్ హల్ చల్

విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ హల్ చల్ చేశారు. తన అనుచరులను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఎస్ ఐ, సిబ్బందితో నందిగం సురేష్, ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని ఫోన్ లో రికార్డు చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ పై కూడా సురేష్ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. తన ఫోన్ ఇవ్వాలని కోరిన శ్రీనివాస్ పై సురేష్ అనుచరులు దాడి కూడా చేసినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు యువకుల్లో ఒకరు సురేష్ మేనల్లుడని తెలుస్తోంది.

విజయవాడలోని ఓ మల్టిప్లెక్స్ లో సినిమా చూసి వస్తున్న ముగ్గురు యువకులు బైకుపై అతివేగంగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ఆ ముగ్గురినీ ఆపిన కృష్ణలంక పోలీసులు..వారిని ప్రశ్నించారు. అయితే, తాము ఎంపీ నందిగం సురేష్ మనుషులమని పోలీసులడిగిన ప్రశ్నలకు జవాబివ్వకుండా…ఆ యువకులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో, ఆ యువకులను బలవంతంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, ఆ తతంగాన్ని వీడియో తీసిన యువకులు…దానిని నందిగం సురేష్‌కు పంపించారు.

దీంతో, అర్ధరాత్రి హుటాహుటిన తన అనుచరులతో కలిసి ఎంపీ నందిగం సురేష్ కృష్ణలంక పీఎస్‌కు వచ్చి హల్ చల్ చేశారు. తన అనుచరులను పీఎస్‌కు ఎందుకు తీసుకొచ్చారంటూ చిందులు తొక్కారు. వారిపై ఎందుకు చేయి చేసుకున్నారంటూ నానా హంగామా చేశారు. పోలీసులతో నందిగం సురేష్, ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగి దురుసుగా ప్రవర్తించారు. దీంతో, ఆ తతంగాన్ని రికార్డ్ చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ఫోన్ ను సురేష్ అనుచరులు లాక్కున్నారు. అంతటితో ఆగకుండా…స్టేషన్ లోని ఫర్నిచర్ ను సురేష్ అనుచరులు ధ్వసం చేసి పీఎస్‌ నుంచి వెళ్లిపోయారు.

ఆ సమయంలో తన ఫోన్ తిరిగివ్వాలని ఎంపీ అనుచరులను కానిస్టేబుల్ శ్రీనివాస్ కోరగా, అతడిపై వారు దాడి చేసి అక్కడినుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు పొక్కుండా పోలీసు ఉన్నతాధికారులు యత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారం ఆల్రెడీ సోషల్ మీడియా, మీడియాలో లీక్ కావడంతో ఏం చేయాలా అని ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది.