బీజేపీ చుట్టూ టీఆర్ఎస్ ఉచ్చు..!

తెలంగాణ లో క్ర‌మంగా బ‌ల‌ప‌డుతున్న బీజేపీని నిలువ‌రించేందుకు టీఆర్ఎస్ నూత‌న పంథా ఎంచుకోనుందా..? త‌మ పాల‌న‌కు కంట‌గింపుగా మారిన క‌మ‌లం పార్టీ నేత‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు కేసీఆర్ మ‌రో మార్గంలో వెళుతున్నారా? విభ‌జ‌న అంశాల‌ను లేవ‌నెత్తి ఆ పార్టీ నేత‌ల‌ను ఇరుకున పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారా..? ప్ర‌జ‌ల్లో మ‌రోసారి సెంటిమెంటు రాజేయాల‌ని నిశ్చ‌యించుకున్నారా..? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు తీసి క‌మ‌లం నేత‌ల నోర్లు మూయించాల‌ని సీఎం కేసీఆర్ తాజా నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. విభ‌జ‌న చ‌ట్టంలో హామీల‌కు ప్ర‌ధాన కార‌ణం కాంగ్రెస్సే అయినా.. బీజేపీ మ‌ద్ద‌తు తోనే రాష్ట్రం విడివ‌డినందున.. ప్ర‌స్తుతం అధికారంలో బీజేపీనే ఉన్నందున ఆ పార్టీని కార్న‌ర్ చేయాల‌ని టీఆర్ఎస్ భావిస్తోంది.

రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీల అమలు కోసం టీఆర్ఎస్ త‌మ ఆందోళ‌న‌ల‌ను ఉధృతం చేయాల‌ని భావిస్తోంది. ఇందులో ముఖ్యంగా ఆదిలాబాద్ సిమెంటు కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా యూనిట్ పున‌రుద్ధ‌ర‌ణ‌కు సాధ‌న స‌మితి ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ అంశంపై పార్ల‌మెంటు వేదిక‌గా కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని కేటీఆర్ తో జ‌రిగిన భేటీలో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. జోగు రామ‌న్న నేతృత్వంలో ఆదిలాబాద్ జిల్లా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఈ అంశంపై చ‌ర్చించారు.

అలాగే.. బ‌య్యారం స్టీలు ప్లాంట్ కోసం నేత‌లు తాజాగా ఆందోళ‌న‌కు దిగారు. మ‌హ‌బూబాబాద్ లో న‌ల్ల‌బ్యాడ్జీలు ధ‌రించి నిర‌స‌న తెలిపారు. ఇక ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కాజీపేట రైల్వే వ్యాగ‌న్ల అంశం ఇప్ప‌టికీ కేంద్రం వ‌ద్ద పెండింగ్ లో ఉంది. రాష్ట్రం భూమి కేటాయించినా కేంద్రం మంజూరు చేయ‌డం లేద‌ని ఆగ్ర‌హంగా ఉన్నారు. దీనిపై అఖిల‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో కాజీపేట‌లో టీఆర్ఎస్ ధ‌ర్నా నిర్వ‌హించ‌నుంది. సికింద్రాబాద్ రైల్వే జీఎం కార్యాల‌యం ఎదుట నిర‌స‌న చేప‌ట్ట‌నుంది.

ఇవే కాకుండా కొన్ని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను కేంద్రం ప్రైవేటీక‌రిస్తోందంటూ రాష్ట్రం అసంతృప్తి వ్య‌క్తం చేస్తోంది. ఇందులో సింగ‌రేణి, బీఎస్ఎన్ఎల్‌, ఈసీఐఎల్‌, త‌పాలా, బీమా, బ్యాంకింగ్‌, హెచ్ఏఎల్‌, బీడీఎల్‌, ఎల్ఐసీ.. త‌దిత‌ర సంస్థ‌ల‌ను కార్పొరేట్ వ్య‌వ‌స్థ‌కు అప్ప‌గించేందుకు కేంద్రం స‌న్నాహాలు చేస్తోందంటూ ఆగ్ర‌హంగా ఉంది. ఈ రంగాల‌కు చెందిన ఉద్యోగుల‌తో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇటీవ‌లై స‌మావేశ‌మై చ‌ర్చించారు. ఈ అంశాల‌న్నింటిపై పార్ల‌మెంటులో కేంద్రాన్ని నిల‌దీసి.. రాష్ట్రంలో ఆ పార్టీ ఎంపీల‌ను నిలువ‌రించాల‌ని టీఆర్ఎస్ భావిస్తోంది. బీజేపీ దీన్ని ఎలా ఎదుర్కుంటుందో వేచి చూడాలి.