తొందరలోనే కొత్త జిల్లాల ఏర్పాటు ?

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలు కాబోతోందని సమాచారం. ఇపుడున్న 13 జిల్లాల స్ధానంలో తొందరలోనే 26 జిల్లాలు రాబోతున్నాయట. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామన్నది జగన్మోహన్ రెడ్డి మ్యానిఫెస్టోలోనే చెప్పారు. అంతేగాక అదే విషయాన్ని అంతకుముందు పాదయాత్రలో కూడా ప్రకటించారు. కాకపోతే అరకు పార్లమెంట్ నియోజకవర్గం వైశాల్యంలో చాలా పెద్దది కాబట్టి దీన్ని మాత్రం రెండు జిల్లాలుగా విభజించబోతున్నట్లు సమాచారం.

అదనపు జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ రెండు మూడు రోజుల్లో విడుదల కాబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. జిల్లాల పునర్వవ్యస్ధీకరణలో భాగంగా 38 రెవిన్యు డివిజన్లలో మార్పలుంటాయట. కొత్తగా 8 రెవిన్యు డివిజన్లను ఏర్పాటు చేయాలని అలాగా 3 డివిజన్లను రద్దు చేయాలని కూడా డిసైడ్ అయిపోయిందట. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఎప్పుడో జరగాల్సింది. కానీ ఏవో ఇబ్బందుల వల్ల ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతున్నాయి.

అలాంటిది ఇపుడు మళ్ళీ ప్రక్రియ రెడీ అవుతున్నట్లు సమాచారం బయటకొచ్చింది. జగన్ హామీల ఆధారంగానే చంద్రబాబు నాయుడు కూడా జిల్లాలను పార్లమెంటు జిల్లాలుగా విభజించారు. తెలంగాణాలో కూడా కొత్త జిల్లాల ఏర్పాటు జరిగినా అంతా అయోమయంగానే ఉంది. ఒక శాస్త్రీయమైన విధానం లేకుండా కేసీయార్ తనిష్టం వచ్చినట్లు జిల్లాలను పెంచుకుంటుపోయారు. అందుకనే జనాలకు ఎవరికీ కొత్త జిల్లాల ఏర్పాటు బుర్రలోకి ఎక్కలేదు. అందుకనే ఇపుడు కూడా కొత్త జిల్లాల పేర్లు చెప్పకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనే చెప్పుకుంటున్నారు.

మూడు నియోజకవర్గాలతో కూడా తెలంగాణాలో కేసీయార్ జిల్లాను ఏర్పాటు చేసేశారు. కేటీయార్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం కేంద్రంగా మూడు నియోజకవర్గాలతోనే జిల్లా ఉంది. దీన్నిబట్టే జిల్లాల పెంపు ఎంత అశాస్త్రీయంగా జరిగిందో అర్ధమైపోతోంది. ఏపీలో అలా కాకుండా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా అంటే ఇందులో కొంత శాస్త్రీయతుంది. ఏదేమైనా తొందరలోనే కొత్త జిల్లాలు ఏర్పాటవటం ఖాయమైపోయింది.