పీఆర్సీపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఏపీలో పీఆర్సీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య వివాదం చినికిచినికి గాలివానలా మారిన సంగతి తెలిసిందే. కొత్త పీఆర్సీ వల్ల తమ జీతాలు తగ్గుతున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే, జీతాలు తగ్గడం లేదని, కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు తీసుకోవాలని ఉద్యోగులకు ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే కొత్త పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే నేడు ఆ పిటిషన్‌ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచే అధికారం, తగ్గించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని  హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, పీఆర్సీ పర్సంటేజ్‌లపై ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసే హక్కు ఉద్యోగులకు లేదని క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ, పీఆర్సీ నివేదిక వెల్లడి కాకుండే…దానికోసం ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఉద్యోగుల తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది.

కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల జీతాలు పెరిగాయని ఆ గణాంకాలను హైకోర్టుకు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వివరించారు. ఉద్యోగుల గ్రాస్ శాలరీ పెరిగిందని చెప్పారు. అయితే, హెచ్ఆర్ఏ విభజన మాత్రం చట్టం ప్రకారం జరగలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ఆరోపణతో ఏకీభవించని హైకోర్టు….పీఆర్సీ వల్ల జీతం పెరిగిందా? లేదా? తగ్గితే ఎంత తగ్గింది? అన్నది చెప్పాలని, గణాంకాల్లో ఆ లెక్కలు అందజేయాలని ఆదేశించింది. అంతేకాదు, పిటిషనర్ కృష్ణయ్యతో పాటు స్ట్రిరింగ్ కమిటీ సభ్యులు కూడా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. దాంతోపాటు సమ్మె నోటీసు ఇచ్చిన 12 మంది కమిటీ సభ్యులు కూడా విచారణకు రావాలని కోర్టు ఆదేశించింది.