అలా అయితే సినిమాలు వాయిదా వేసుకోండి: పేర్ని నాని

మ‌ళ్లీ క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నైట్ క‌ర్ఫ్యూ పెట్ట‌డం.. సినిమా థియేట‌ర్ల‌లో ఆక్యుపెన్సీని 50 శాతానికి త‌గ్గించ‌డం.. అలాగే సెకండ్ షోలు ర‌ద్దు చేయ‌డం తెలిసిందే. ఓవైపు తెలంగాణ‌లో ఇలాంటి ఆంక్ష‌లేమీ లేక‌పోగా.. ఏపీలో మాత్రం థియేట‌ర్ల‌ను టార్గెట్ చేయ‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

సినీ ప‌రిశ్ర‌మ‌ను ఇబ్బంది పెట్టేందుకు ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఇలా ఆంక్ష‌లు పెడుతున్నార‌నే అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఐతే త‌మ ప్ర‌భుత్వానికి అలాంటి ఉద్దేశ‌మేదీ లేద‌ని తేల్చేశారు ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని. థియేట‌ర్ల‌పై ఆంక్ష‌ల‌కు సంబంధించి ఎవ‌రికైనా ఇబ్బంది అనిపిస్తే సినిమాలు వాయిదా వేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. టికెట్ల ధ‌ర‌లు, ఇత‌ర అంశాల‌పై ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌తో స‌మావేశం అనంత‌రం పేర్ని నాని ఈ వ్యాఖ్య‌లు చేశారు.

కొవిడ్ కేసులు నానాటికి పెరుగుతుండ‌టంతోనే థియేట‌ర్ల‌లో 50 శాతం ఆక్యుపెన్సీ తీసుకొచ్చామని, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇది త‌ప్ప‌నిస‌రి అని నాని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఇబ్బందిగా అనిపిస్తే సినిమాలు వాయిదా వేసుకోవాల‌ని అన్నారు. కొవిడ్ కార‌ణంగానే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాల‌ను వాయిదా వేసిన‌పుడు మిగ‌తా సినిమాలకు కూడా అలాగే చేసుకోవ‌చ్చు క‌దా అని ఆయ‌న అన్నారు. ఇక టికెట్ల ధ‌ర‌లకు సంబంధించి సినిమా వాళ్లు ర‌క‌ర‌కాల లాజిక్స్ చెబుతున్నార‌ని.. తాము కూడా ఇలాంటి లాజిక్‌లు చెబితే వారికి క‌ష్టంగా అనిపిస్తుంద‌న్నారు నాని.

తాము టికెట్ల ధ‌ర‌ల విష‌యంలో చ‌ట్ట వ్య‌తిరేకంగా ఏమీ చేయ‌లేద‌ని.. 2013లో జారీ చేసిన జీవో నంబ‌ర్ 100తో పోలిస్తే ఎక్కువ ధ‌ర‌లే ఏపీలో అమ‌ల‌వుతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. టికెట్ల ధ‌ర‌ల‌పై ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీ స‌మావేశాలు నిర్వ‌హిస్తోంద‌ని.. ఆ క‌మిటీతో తన‌కే సంబంధం లేద‌ని.. సినిమా వాళ్ల‌కు ఏమైనా అభ్యంత‌రాలుంటే రామ్ గోపాల్ వ‌ర్మ లాగే ఆ క‌మిటీని క‌లిసి త‌మ అభిప్రాయాలు చెప్పాల‌ని నాని సూచించారు. ఆ క‌మిటీ స‌భ్యుల‌తో హోం సెక్ర‌ట‌రీ చ‌ర్చించి టికెట్ల ధ‌ర‌ల‌పై తుది నిర్ణ‌యం తీసుకుంటార‌ని చెప్పారు.