అధికారం మ‌ళ్లీ మాదే: KTR

తెలంగాణ‌లో వచ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ తామే అధికారంలోకి వ‌స్తామ‌ని.. సీఎం కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో సమ్మిళిత వృద్ధి కొనసాగుతోందని  అన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా తెలంగాణ రూపురేఖలు మారుస్తున్నామని పేర్కొన్నారు.

నల్గొండలో పర్యటించిన మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఐటీ హబ్కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.110 కోట్లతో నల్గొండలో ఐటీ హబ్ నిర్మాణం జరగనుంది. ఈ ఐటీ హబ్ ద్వారా దాదాపు 3 వేల మందికి ఉపాధి దొరకనుంది.

18 నెలల్లోగా ఈ హబ్ను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలను ఆయన ప్రారంభించారు. నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరిన మంత్రి కేటీఆర్కు తెరాస నేతలు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ రాక సందర్భంగా నల్గొండ బైపాస్ నుంచి 2 వేల బైక్లతో తెరాస శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. మంత్రులకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ సమస్యను నిర్మూలించామని కేటీఆర్ వెల్లడించారు.

65 ఏళ్లలో జిల్లాలో సాధ్యంకాని ఫ్లోరోసిస్ సమస్యను ఆరేళ్లలోనే పరిష్కరించామని చెప్పారు. ఐటీ సాంకేతిక ఫలాలు సామాన్యు లకు అందాలన్నదే కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. 75వేల చదరపు అడుగుల్లో 750మంది కూర్చొనేలా నిర్మించబోయే ఐటీ హబ్‌ ద్వారా 15 కంపెనీలు 1600 ఉద్యోగాలు కల్పించనున్నట్టు చెప్పారు.

‘రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడా లేదు. ప్రత్యేక రాష్ట్రం రాకముందు, ఇప్పటి పరిస్థితులను బేరీజు వేసుకోండి. దేశంలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. అన్నదాతకు రైతుబంధు ద్వారా పెట్టుబడి ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. భారత ఆర్థిక వ్యవస్థకు 4 వ ఆర్థిక చోదక శక్తిగా తెలంగాణ ఉందని ఆర్బీఐ నివేదికలో వెల్లడైంది“ అని తెలిపారు. ఇదంతా ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని.. త‌మ‌కే మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌ట్టం క‌డ‌తార‌ని అన్నారు.