వంగ‌వీటి రాధాకు స‌ర్కారు భ‌ద్ర‌త‌..

కాపు నాయ‌కుడు వంగ‌వీటి రంగా కుమారుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు ఏపీ ప్ర‌భుత్వం 2+2 గన్‌మెన్లతో భ‌ద్ర‌త క‌ల్పించింది. ఇటీవ‌ల రంగా వ‌ర్ధంతి సంద‌ర్భంగా.. వంగవీటి రాధా సంచ‌లన వ్యాఖ్య లు చేశారు. త‌నను చంపేందుకు రెక్కీ నిర్వ‌హించార‌ని అన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఈ నేప‌థ్యంలో మంత్రి కొడాలి నాని ఈ విష‌యాన్ని సీఎం జ‌గ‌న్‌.. కు చేర‌వేశారు. ఈ నేప‌థ్యంలో రాధాకు భ‌ద్రత క‌ల్పిస్తూ.. నిర్ణ‌యించారు. దీనిపై మంత్రి నాని మాట్లాడుతూ.. వెంటనే రాధాకు భద్రత కల్పించాలని, రాధాపై ఎవరు రెక్కీ చేశారో దర్యాప్తు జరపాలని ఇంటెలిజెన్స్ డీజీని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు.

అయితే.. టీడీపీ నేత‌గా ఉన్న రాధాకు వైసీపీ ప్ర‌భుత్వం హుటాహుటిన భ‌ద్ర‌త క‌ల్పించ‌డంపై అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే.. మంత్రి మాత్రం.. వైసీపీలోకి వస్తానని రాధా చెప్పలేదని.. తాము రమ్మనలేదని  స్పష్టం చేశారు. రాధా వైసీపీలోకి వస్తానంటే అప్పుడే సీఎంతో మాట్లాడతామన్నారు. రాధా పిలిస్తేనే రంగా విగ్రహావిష్కరణకు వెళ్లామ‌ని, అంతకంటే మరేం లేదంటూ   వ్యాఖ్యానించారు.

“రాధాకు 2+2 గన్‌మెన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వెంటనే భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్ డీజీకి ఆదేశించారు. రాధాపై ఎవరు రెక్కీ చేశారో దర్యాప్తు జరపాలని సీఎం ఆదేశించారు. వైసీపీలోకి వస్తానని రాధా చెప్పలేదు.. మేమూ రమ్మనలేదు. రాధా వైసీపీలోకి వస్తానంటే అప్పుడే సీఎంతో మాట్లాడతాం. పిలిస్తేనే రంగా విగ్రహావిష్కరణకు వెళ్లాం.. అంతకంటే మరేం లేదు“ అనిమంత్రి వ్యాఖ్యానించారు.

కొందరు తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని..  వంగవీటి రాధా ఆరోపించారు. చంపాలని చూసినా భయపడేది లేదన్న ఆయన.. దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని తేల్చిచెప్పారు. వంగవీటి రంగా కీర్తి, ఆశయాల సాధనే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

వాస్త‌వానికి టీడీపీ నేత‌ల‌కు ఉన్న భ‌ద్ర‌త‌ను ఏపీ ప్ర‌భుత్వం త‌గ్గిస్తూ..వ‌స్తోంది. అలాంటి స‌మ‌యంలో ఇప్పుడు అనూహ్యంగా రాధాకు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వైసీపీలో ఉన్న రాధా.. త‌న‌కు ఆశించిన టికెట్ ఇవ్వ‌లేద‌ని పేర్కొంటూ.. పార్టీ మారిపో యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న టీడీపీ వాయిస్ గ‌ట్టిగానే వినిపిస్తున్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో ఆయ‌న అలా త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని ప్ర‌క‌టించారో.. లేదో.. వెంట‌నే.. వైసీపీ స్పందించ‌డం వెనుక‌.. రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు.

ఒక‌టి కాపుల‌కు తాము క‌ల్పిస్తున్న భ‌ద్ర‌త ఇంకెవ‌రు క‌ల్పించ‌డం లేద‌నే సంకేతాలు ఇస్తున్నార‌ని చెబుతున్నారు. ప్ర‌త్య‌ర్థి అయిన‌ప్ప‌టికీ.. కాపుల‌ను కాపాడుతున్నామ‌నే వాద‌న‌ను తీసుకెళ్లే వ్యూహం ఉంద‌ని అంటున్నారు. రెండు.. టీడీపీలో ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోయినా.. తాము ప‌ట్టించుకున్నామ‌నే సంకేతాలు పంపుతున్నార‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ.. రాధాను పార్టీలోకి తీసుకునే ఆలోచ‌న ఉంద‌నే సంకేతాలు కూడా పంపిన‌ట్టు అయింద‌ని అంటున్నారు.