జ‌గ‌న్ స‌ర్కారుకు హైకోర్టులో ఊర‌ట‌

ఏపీలోని వైసీపీ స‌ర్కారుకు చాలా నాళ్ల త‌ర్వాత‌.. హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఎప్ప‌టిక‌ప్పుడు ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు వివాదాస్ప‌దం కావ‌డం.. ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై ప్ర‌జ‌ల్లో ఎవ‌రో ఒక‌రు కోర్టుకు వెళ్ల‌డం.. అక్క‌డ హైకోర్టు ముందు ప్ర‌భుత్వం డీలా ప‌డుతుండ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో కొన్నాళ్ల కింద‌ట‌.. హైకోర్టును , న్యాయ‌మూర్తుల‌ను కూడా వైసీపీ నేత‌లు దూషించ‌డం.. దీనిపైనా కేసులు న‌మోదు కావ‌డం.. సీబీఐ విచార‌ణ కూడా కొన‌సాగుతుండ‌డం తెలిసిందే. అయితే.. తాజా కీల‌క ప‌థ‌కానికి సంబంధించి హైకోర్టులో ఏపీ స‌ర్కారుకు సానుకూలంగా నిర్ణ‌యం వెలువ‌డింది.

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ప‌థ‌కాల‌పై హైకోర్టులో విచారణ జరిగింది. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బుల జమపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్.. స్టే విధించింది. ఆ నిధుల‌ను త‌ల్లుల ఖాతాలో వేయాల‌న్న స‌ర్కారు నిర్ణ‌యంపై సానుకూలంగా స్పందించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల్లో భాగంగా.. లబ్ధిదారులకు ఇచ్చే సొమ్ము కళాశాల ఖాతాల్లో జమ చేయాలని సింగిల్ జడ్జి బెంచ్ ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం.. డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది.

కళాశాలల్లో చదివే అర్హులైన విద్యార్థులకు “జగనన్న విద్యా దీవెన” పథకం కింద చెల్లించే బోధన రుసుములను (ఫీజు రీయింబర్స్‌మెంట్‌) తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఇక నుంచి విద్యార్థుల తరఫున సొమ్మును కళాశాలల ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించింది. తల్లుల ఖాతాలో జమ చేసేందుకు వీలు కల్పించే జీవో 28ని రద్దు చేసింది. మరో జీవో 64లోని నిబంధనలను కొట్టేసింది. ఇప్పటికే తల్లుల ఖాతాల్లో జమ చేసిన నగదును కళాశాలలకు చెల్లించేలా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉండదని పేర్కొంది. ఆయా కళాశాలలు విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చని తెలిపింది.

ప్రభుత్వం తల్లుల ఖాతాలో జమ చేసిన సొమ్మును.. 40% మంది కళాశాలలకు చెల్లించలేదని గుర్తు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును తల్లులు చెల్లించకపోతే కళాశాలలు చదువు చెప్పలేవని తెలిపింది. తరగతులు సక్రమంగా నిర్వహిస్తున్నారా.. లేదా? మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా.. లేవా? అని పరిశీలించే అవకాశం తల్లిదండ్రులకు కల్పించారని గుర్తు చేసింది. లోపాలుంటే కళాశాలలపై ఫిర్యాదు చేసే హక్కును తల్లిదండ్రులకు ఇచ్చారని వెల్లడించింది. తల్లులు రుసుము చెల్లించకపోతే ఆ విద్యార్థి కళాశాలలో కొనసాగే అంశంపై జీవోలో పేర్కొనలేదని ఆక్షేపించింది.

కళాశాలల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తే విద్యార్థులు మధ్యలో చదువుకు దూరమయ్యే అవకాశం చాలా తక్కువని సింగిల్ జ‌డ్జి పేర్కొన్నారు.  అందువల్ల తల్లుల ఖాతాలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము జమ చేసేందుకు వీలు కల్పిస్తున్న జీవోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేర‌కు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై 2 వారాల స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అప్ప‌టి వ‌ర‌కు త‌ల్లుల ఖాతాల్లో నిధులు జ‌మ చేయొచ్చ‌ని పేర్కొంది. దీంతో ప్ర‌భుత్వానికి కొంత ఊర‌ట ల‌భించింద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.