లోక్ సభలో జగన్ పై రఘురామ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీలు వర్సెస్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ వెర్బల్ వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు కోరగా…జగన్ పై అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం చేయాలని రఘురామ చెప్పడంతో లోక్ సభ సాక్షిగా మాటల తూటాలు పేలాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని రఘురామ లోక్ సభలో షాకింగ్ కామెంట్లు చేశారు.

లోక్‌సభలో 377 నిబంధన కింద లిఖితపూర్వకంగా రఘురామ ఈ విషయాన్ని లేవనెత్తారు. ఏపీ దివాలా తీసేందుకు సిద్ధంగా ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా మారిందని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని నిండు సభలో వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

అంతేకాదు, కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారిన జగన్ రుణాలు తీసుకుంటున్నారని, ఆర్థికంగా దివాళా తీసేందుకు రెడీగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. సభ అనంతరం మీడియాతో మాట్లాడిన రఘురామ జగన్ పై షాకింగ్ కామెంట్లు చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మి నారాయణ ఇంటిపై సీఐడీ పోలీసుల సోదాలు జగన్ కక్ష్య సాధింపు చర్యలేనని అన్నారు. సోదాల సమయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను ఉండమని చెప్పిన విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించారు.

కానీ, మరుసటి రోజు రాధాకృష్ణపై సీఐడీ అధికారులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కక్ష్య సాధింపేనని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం పోలీసులను దారుణంగా వాడుకుంటోందని, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న సంగతి పోలీసులు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. తప్పులు చేసే పోలీసులు కూడా శిక్షలకు సిద్ధంగా ఉండాలని రఘురామ షాకింగ్ కామెంట్లు చేశారు.