ఏపీ తెలంగాణ ప్రజలు ఇక దర్జాగా ఊరెళ్ళి పోవచ్చు

ఆంధ్రప్రదేశ్ – తెలంగాణల మధ్య సరిగ్గా రెండున్నర నెలల క్రితం స్వేచ్ఛా ప్రయాణాలు బంద్ అయ్యాయి. అత్యవసరాలకు మాత్రమే ఇరు రాష్ట్రాలు ప్రజలను అనుమతించాయి. అయితే, కొద్దిరోజుల క్రితమే దేశంలో తెలంగాణ నుంచి వెళ్లడానికి, తెలంగాణకు రావడానికి ఎటువంటి పాసులు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే… ఏపీ లో మాత్రం పాసు లేకుండా అనుమతించం, క్వారంటైన్ తప్పదు వంటి నిబంధనలు పెట్టడంతో తెలంగాణ స్వేచ్ఛ ఇచ్చినా ఏపీకి చెందిన హైదరాబాదీయులు ఇళ్లకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు.

ఈరోజు ఏపీ ప్రభుత్వం కూడా చెక్ పోస్టులను, నిబంధనలు ఎత్తేసింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు బాగా పుంజుకోనున్నాయి. బడులు లేకపోవడం, వర్క్ ఫ్రం హోమే కావడంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్దామని చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇన్నాళ్లకు ఇరు ప్రభుత్వాలు కరుణించడంతో ఇక నుంచి ఏపీ – తెలంగాణ మధ్య విస్తృతంగా రాకపోకలు పున:ప్రారంభం కానున్నాయి.

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు రాకపోకలు సాగించాలా వద్దా అనే విషయాన్ని రాష్ట్రాలకు వదిలేసింది. దీంతో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా స్పందిస్తోంది. ఇప్పటికీ మన పక్కనున్న కర్ణాటక ఇతర రాష్ట్రీయులను అనుమతించడం లేదు.

తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్ కావడం వల్ల ఇరు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర వ్యాపారాలు మందగించాయి. చాలామంది హైదరాబాదులో ఉన్న ఏపీ వారికి వ్యవసాయ వ్యవహారాలు కూడా ఏపీలో ఉన్నాయి. ఇంకా విద్యా పరమైన అవసరాలు కూడా ఇరు రాష్ట్రాల మధ్య ఎక్కువే. పాలనా పరంగా మాత్రమే ఇవి రెండు రాష్ట్రాలు గాని ప్రజల్లో ఆ భావన లేదు. అందుకే ప్రయాణ నిబంధనలు అన్నిటికీ అడ్డంకిగా మారడంతో ఏపీ కూడా చొరవ తీసుకుని నిబంధనలు ఎత్తివేసింది. ఇక నుంచి హ్యాపీ జర్నీ.