ఢిల్లీలో కేసీఆర్ కారు తిరిగేనా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట‌మి దెబ్బ‌కు ఒక్క‌సారిగా మీడియా ముందుకు వ‌చ్చిన కేసీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌నే అభిప్రాయాలున్నాయి. వ‌రి కోనుగోళ్ల బాధ్య‌త మొత్తం కేంద్రం మీదే నెట్టేసి.. వ‌రి వేయొద్ద‌ని కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వ‌మే చెబుతుంద‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. వ‌రి కోనుగోళ్ల‌పై కేంద్రం స్ప‌ష్ట‌మైన వైఖ‌రి కోసం ఏకంగా ఒక‌ప్పుడు ఎత్తివేయాల‌నుకున్న ధ‌ర్నాచౌక్ ద‌గ్గ‌రే ఆయ‌నే స్వ‌యంగా ధర్నా చేశారు. అదే క్ర‌మంలో రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న రైతుల‌కు అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు.

ఇక మోడీ ప్ర‌భుత్వం ఆ చ‌ట్టాలు ర‌ద్దు చేయ‌గానే మ‌ళ్లీ మీడియా ముందుకు వ‌చ్చి విద్యుత్ చ‌ట్టం కూడా వెన‌క్కి తీసుకోవాల‌ని, రైతుల‌పై కేసులు ఎత్తివేయాల‌ని, మ‌ర‌ణించిన రైతు కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించాల‌నే డిమాండ్లు ఏక‌రువు పెట్టారు. ఏకంగా మోడీతోనే తేల్చుకుంటామ‌ని హ‌స్తిన‌కు బ‌య‌ల్దేరారు.

అయితే ఇప్పుడు ఉన్న‌ట్లుండి కేంద్రం మీద కేసీఆర్ పోరాటం చేయ‌డం వెన‌క మ‌రో వ్యూహం లేక‌పోలేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వ‌రి కోనుగోళ్ల విష‌యాన్ని తెర ముందుకు తెచ్చి నానా యాగీ చేస్తున్న ఆయ‌న‌.. తెర‌వెన‌క మాత్రం కేంద్రంపై పట్టు సాధించాలనే ప్ర‌ణాళిక‌తోనే ముందుకు సాగుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన మోడీపై సహ‌జంగానే దేశ‌వ్యాప్తంగా వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఇది గ‌మ‌నించిన ఆయ‌న ప్ర‌భుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించ‌డంతో పాటు మూడు రైతు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసి దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు పూనుకున్నారు. ఇప్పుడు దేశంలో మోడీ ప్ర‌భ త‌గ్గుతుంద‌నే నిజాన్ని తెలుసుకున్న కేసీఆర్‌.. ఆయ‌న‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేందుకే పావులు క‌దుపుతున్నార‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అందుకే రైతు చ‌ట్టాలకు వ్య‌తిరేకంగా చేసిన ఉద్య‌మంలో ప్రాణాలు వ‌దిలిన కుటుంబాల‌కు రూ.3 ల‌క్ష‌ల చొప్పున న‌ష్ట ప‌రిహారం అందించ‌నున్న‌ట‌లు కేసీఆర్ ప్ర‌క‌టించారని అంటున్నారు. ఇలా ప్ర‌క‌టించ‌డం ద్వారా దేశ ప్ర‌జ‌ల దృష్టిని త‌న‌వైపు తిప్పుకోవ‌డంతో పాటు జాతీయ రాజ‌కీయాల్లో కీల‌కం కావొచ్చ‌ని ఆయ‌న అనుకున్నార‌ని తెలుస్తోంది.

గ‌తంలో యూపీఏ, ఎన్డీఏ కాకుండా మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ విశ్వ ప్ర‌యత్నాలు చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ అది ఓ కొలిక్కి రాక‌పోవ‌డంతో ఇన్ని రోజుల సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడిక మోడీపై వ్య‌తిరేక‌త‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుని కేంద్రంలో చ‌క్రం తిప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

కానీ కేంద్రంలో కేసీఆర్ కారు తిరగ‌డం అంత సుల‌భ‌మేమీ కాదు. ఎందుకంటే ఇప్ప‌టికే మోడీకి తానే స‌రైన ప్ర‌త్యామ్నాయ‌మ‌ని ప్ర‌క‌టించిన తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ దేశ‌వ్యాప్తంగా త‌న పార్టీని విస్త‌రించే ప‌నుల్లో ఉన్నారు. వ‌చ్చే ఏడాది జ‌రిగే ఉత్త‌రప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, గోవా, మ‌ణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఆమె ఇప్ప‌టి నుంచే దృష్టి సారించారు. ముఖ్యంగా జాతీయ రాజ‌కీయాల్లో ఎంతో కీల‌క‌మైన యూపీలో ప‌ట్టు కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

మోడీకి వ్య‌తిరేకంగా ఏర్ప‌డే విప‌క్షాల కూట‌మికి కూడా కాంగ్రెస్ కంటే తానే సార‌థ్యం వ‌హిస్తే మంచిద‌నే అభిప్రాయంతో ఆమె ఉన్నారు. ఇప్ప‌టికే దీదీ మిగ‌తా అన్ని పార్టీల‌తోనూ చ‌ర్చ‌లు కొన‌సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ కారుకు ఆమె అడ్డుప‌డే అవ‌కాశం క‌చ్చితంగా ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌నే కేసీఆర్ ఆశ ఇప్ప‌ట్లో నెర‌వేరేలా లేద‌ని అంటున్నారు.