బాబు వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని రియాక్షన్

కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారాం. ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో విపక్ష నేత చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తమ్మినేనికి తాను రాజకీయంగా పున:భిక్ష పెట్టానంటూ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. బాబు మాటల్లో నిజం లేదన్న ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు.

తనకు రాజకీయ భిక్ష పెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు అని.. తర్వాత రాజకీయంగా పున:భిక్ష పెట్టింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ‘నాకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు కాదు. నేను టీడీపీలో చేరే నాటికి చంద్రబాబు ఆ పార్టీలోనే లేరు. అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్నారు. ఎన్టీఆర్ నన్ను పిలిచి పార్టీలోకి ఆహ్వానించి ప్రజాప్రతినిధిని చేశారు. ఆ తర్వాత చంద్రబాబు టీడీపీలోకి వచ్చి చేరారు’ అని గుర్తు చేశారు.

ఆ మాటకు వస్తే చంద్రబాబుకు కూడా రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆరేనన్న తమ్మినేని.. తర్వాతి కాలంలో వివిధ అంశాల మీద తాను విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చేశానన్నారు. ఆ తర్వాత తాను వరుసగా ఎన్నికల్లో ఓడిపోయి పదిహేనేళ్ల పాటు రాజకీయంగా వెనుకబడిపోయానన్నారు. అలాంటి వేళలో జగన్మోహన్ రెడ్డి తనను పిలిపించి.. పార్టీలో చేరాలని ఆహ్వానించారని గుర్తు చేశారు.

జగన్ సూచనలతో తాను వైఎస్ విజయమ్మ సమక్షంలో వైసీపీలో చేరినట్లు చెప్పారు. ఈ లెక్క చూసుకుంటే తనకు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెడితే.. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పున:భిక్ష పెట్టారన్నారు. సభాపతి స్థానంలో ఉన్న తనను చంద్రబాబు అనటంతో వాస్తవాల్ని వెల్లడిస్తున్నానని.. సభకు తెలియజేస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.