అమరావతిపై బీజేపీలో గందరగోళం

అమరావతినే ఏకైక రాజధానిగా కంటిన్యూ చేయాలనే విషయంలో బీజేపీలో గందరగోళం మొదలైందా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ విషయం ఏమిటంటే అమరావతినే ఏకైక రాజధానిగా కంటిన్యూ చేయాలనే డిమాండ్ తో రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరు మండలం నుంచి తిరుమలకు మహా పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే.

ఈ మహాపాదయాత్రలో రైతులు, వివిధ పార్టీల నేతలు, మద్దతుదారులు పాల్గొంటున్నారు. ఈ యాత్రలో బీజేపీ స్ధానిక నేతలు కూడా పాల్గొంటున్నారట. ఇక్కడే పార్టీలో సమస్యంతా మొదలైంది. బీజేపీ నేతలు పాల్గొంటున్న ఈ యాత్రలో పాల్గొనవద్దని పార్టీ ఏపీ ఇన్చార్జి సునీల్ దేవదర్ ఫోన్లు చేసి ఆదేశాలు జారీచేస్తున్నట్లు సమాచారం. ఒకవైపు బీజేపీ స్టేట్ చీఫ్ సోమువీర్రాజేమో మహా పాదయాత్ర కు మద్దతు పలికారు.

అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్ కు మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. వీర్రాజు ప్రకటనకు తగ్గట్లుగానే జిల్లాల నేతలు కూడా యాత్రలో పాల్గొంటున్నారు. ఇలా యాత్రలో పాల్గొంటున్న నేతల్లో కొందరికి దేవదర్ ఫోన్లు చేసి పాల్గొనవద్దని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తమ పార్టీ అసలు అమరావతికి వ్యతిరేకమా ? లేకపోతే మద్దతు ఇస్తున్నదా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

రాష్ట్ర అధ్యక్షుడి నిర్ణయానికి స్టేట్ ఇన్చార్జి ఆదేశాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉండటంతో ఎవరి మాట వినాలో నేతలకు అర్ధం కావటంలేదట. అసలు మహాపాదయాత్ర పై పార్టీలో ఎందుకింత గందరగోళం మొదలైందో కూడా నేతలకు అర్ధం కావటంలేదు. సరే దేవదర్ ఫోన్ ఆదేశాలను పక్కనపెట్టేస్తే పార్టీలో రాజధాని విషయంలో స్పష్టమైన చీలిక ఉండటం మాత్రం వాస్తవం. మూడు రాజధానుల ప్రభుత్వ నిర్ణయంపై ఉత్తరాంధ్రలోని కొందరు నేతలు మద్దతుగా మాట్లాడుతున్నది వాస్తవం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల విషయం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ పరిధిలోనిదే అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. ఇదే నిర్ణయాన్ని అఫిడవిట్ రూపంలో మూడుసార్లు హైకోర్టులో ఇప్పటికే దాఖలు చేసుంది. రైతుల భూములపై జగన్ ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో చూడాలి. మరి ఇంతలోనే మహాపాదయాత్ర విషయంలో బీజేపీలో ఇంత గందరగోళం ఎందుకు మొదలైందో అర్ధం కావటంలేదు.